యాపిల్‌ మొదటి రిటైల్‌ షోరూమ్‌ ముంబైలో

యాపిల్‌ మొదటి రిటైల్‌ షోరూమ్‌ ముంబైలో

దేశంలో యాపిల్‌ తన మొదటి అధికారిక రిటైల్‌ షోరూమ్‌ను ముంబైలో ప్రారంభిస్తోంది. మంగళవారం ఈ స్టోర్‌ను ప్రారంభించేందుకు యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ భారత్ కు చేరుకున్నారు. భారత్‌లో ముంబై, ఢిల్లిల్లో రిటైల్‌ స్టోర్లు ప్రారంభించడం పట్ల యాపిల్‌ ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేసింది. యాపిల్‌ భారత్ అడుగుపెట్టి 25 సంవత్సరాలైన సందర్బంగా ఈ స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

భారత మార్కెట్‌లో విస్తరణకు ఇది కీలక ముందడుగుగా కంపెనీ పేర్కొంది. ముంబై స్టోర్‌ను ఈ నెల 18న, రెండో స్టోర్‌ను ఢిల్లిలో ఏప్రిల్‌ 20న ప్రారంభించనుంది. స్థానికతకు పెద్ద పీట వేస్తూ రూపొందించిన రెండు స్టోర్లూ వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచుతాయని కంపెనీ తెలిపింది. దేశంలో వేలాది ఉద్యోగాల సృష్టికి కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొంది.

భారత్‌ సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తి దాడి ఉందని, వినియోగదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానికంగా పెట్టుబడులు పెట్టడం, మానవాళికి సేవ చేసే ఆవిష్కరణలు కోసం కలిసి పని చేయడం ద్వారా మా భవిష్యత్‌ను నిర్మించుకోవడానికి సంతోషంగా ఉన్నామని టిమ్‌ కుక్‌ ట్విట్‌ చేశారు.

2022-23లో సుమారు 5 బిలియన్‌ డాలర్ల విలువైన యాపిల్‌ ఉత్పత్తుల ఎగుమతులు భారత్ లోనే తయారు అయ్యాయి. భారత్‌లో యాపిల్‌ ఉత్పత్తుల అమ్మకాలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. యాపిల్‌కు భారత్  ఆదాయం 50 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరం అమ్మకాలు 4.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

 యాపిల్‌ కంపెనీ 2020లో భారత్ లో ఆన్‌లైన్‌ సేల్స్‌ స్టోర్‌ను ప్రారంభించింది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేశారు. ఆ సమయంలో యాపిల్‌ కంప్యూటర్లు, ఐ ప్యాడ్స్‌, ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే మొబైల్‌ స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో 700 స్మార్ట్‌ యూజర్లు ఉంటే, అందులో యాపిల్‌ ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య 4 శాతంగా ఉంది.

దీన్ని గణనీయంగా పెంచుకోవాలని యాపిల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే కంపెనీ సొంత రిటైల్‌ అవుట్‌ లెట్‌ను ప్రారంభిస్తోంది. ముంబై, ఢిల్లి తరువాత దేశంలోని అన్ని ప్ర ధాన నగరాల్లోనూ యాపిల్‌ రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనుంది. భారత్  పర్యటలో టిమ్‌ కుక్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. భారత్ లో పెట్టుబడుల గురించి చర్చించే అవ కాశం ఉందని భావిస్తున్నారు.