శబరిమల వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్

శబరిమల వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్
శబరిమల వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. కొట్టాయం జిల్లాలోని చెరువల్లి ఎస్టేట్ సమీపంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. శబరిమల సమీప ప్రాంతాలను పర్యటించిన అనంతరం చెరువల్లి ప్రాంతం ఈ శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సరిపోతుందని భావించింది.
 
కేరళలో వెలిసిన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప మాలను ధరించి, మండలం పాటు నిష్ఠతో మణికంఠుడిని పూజిస్తారు. అనంతరం అయ్యప్పను దర్శించుకోవడానికి తరలి వెళ్తుంటారు. శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్ధ్యం ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టారు.
 
ఈ చెరువల్లి గ్రామం సెంట్రల్ కేరళ పరిధిలోకి వస్తుంది. సెంట్రల్ ట్రావెన్‌కూర్ రీజియన్ పరిధిలోని అయిదు జిల్లాల సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడం వల్ల ఈ అయిదు జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, ఆయా జిల్లాలన్నీ అభివృద్ధి చెందుతాయని కేంద్రం భావిస్తోంది.
 
శబరిమల ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేరళ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలను ఇచ్చిన నేపథ్యంలో డీజీసీఏ, ఏఏఐ ఈ క్లియరెన్సులను జారీ చేసింది.
 
దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం కేరళ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాథమిక చర్యలను చేపట్టింది. డీపీఆర్, విమానాశ్రయ నిర్మాణం, కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయనుంది.
 
భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎరుమేలి పంచాయతీలోని ఒళక్కనాడ్‌‌లో 370, కంజిరాపల్లి తాలూకాలోని ఎరుమేలి సౌత్, మణిమాల గ్రామాల్లో 2570 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులను ఇంకా జారీ చేయాల్సి ఉంది.