
ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోరం జరిగింది. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసిన కొద్దీ దూరంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు.
చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కలకలం రేగింది. పెద్ద ఎత్తున అర్తనాదాలు వినిపించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం పూర్తిగా రక్తసిక్తమైంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రాణభయంతో పరుగులు తీయడం కనిపించింది.
కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ దుర్ఘటన జరగంతో అందరూ షాక్ లో ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతోనే గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిందని చెబుతున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కొందరు కార్యకర్తలు సంతోషంలో పటాకులు పేల్చారని, దీంతో నిప్పు రవ్వలు ఎగిరి.. పక్కన ఉన్న ఓ గుడిసెలో ఉన్న సిలిండర్ పై పడడంతో అది పేలిందని అంటున్నారు.
ఈ ప్రమదంలో అక్కడికక్కడే ఒకరు చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి చనిపోయారని తెలుస్తోంది. గాయపడ్డ వారిలో పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారని సమాచారం అందుతోంది. స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
పోలీసులు కేవలం ప్రజాప్రతినిధులకు రక్షణపై దృష్టిపెట్టారని, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పటాసులు పేల్చే సయమంలో వద్దని వారించే వారెవరూ లేరని చెబుతున్నారు. ముందుగానే పోలీసులు పటాకులు కాల్చొద్దని హెచ్చరించి ఉంటే ఇంతంటి ఘోరం జరిగి ఉండేది కాదని కన్నీటి పర్యంతమవుతున్నారు.
అయితే, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి, సిలిండర్ పేలుడు ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. తాము ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. మీటింగ్ ప్రారంభయ్యే సమయంలో తామంతా స్టేజీపై ఉన్నామని, అప్పుడే సిలిండర్ పేలిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎండల తీవ్రత వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చన్నారు. చిన్న గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాగా, చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్ పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు కూడా ఫోన్ చేసి, ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
బిఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్లనే బాణాసంచా పెళ్లి నిప్పు రవ్వలు ఇంటిపై పది ప్రమాదం జరిగిందని అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు బిఆర్ఎస్ నేతలకు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. బాధ్యులపై తక్షణమే హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ నేతల ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా? అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధ్యులైన బిఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
More Stories
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్