భారతదేశం 2047లో 100 సంవత్సరాల స్వాతంత్య్రోత్సవాన్ని జరుపుకునే సమయానికి విద్యుత్ వాటాలో దాదాపు 9 శాతాన్ని భారతదేశపు అణు వనరుల నుంచి రానుందని, ఇది 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలు సాధించాలన్న నిబద్ధతకు సన్నిహితంగా వచ్చేందుకు తోడ్పడుతుందని, కేంద్ర అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బిఎఆర్సి- బార్క్), అణు ఇంధన విభాగాల సీనియర్ శాస్త్రవేత్తల బృందంతో ముంబైలో సమీక్షా సమావేశం జరుపుతున్న సమయంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అణు ఇంధన/ శక్తి విభాగం ఏర్పరిచన ఇతర లక్ష్యాలలో 2030 నాటికి 20 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించడం అన్నది ఒక మైలురాయిగా నిలుస్తుందని, దీనితో ప్రపంచంలో అమెరికా, ఫ్రాన్స్ల తర్వాత అణు విద్యుత్ / ఇంధనంను భారీగా ఉత్పత్తి చేసే మూడవ దేశం భారత్ అవుతుందని మంత్రి తెలిపారు.
స్వాతంత్య్రానంతరం తొలిసారి 10 రియాక్టర్లను ఒకే ఆర్డర్లో ఆమోదించాలన్న నిర్ణయం తీసుకోవడమే కాక, ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి, జాయింట్ వెంచర్ల కింద అణు వ్యవస్థాపనలను చేసేందుకు అనుమతించడంతో ఈ వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ కొనియాడారు.
ఫలితంగా, నేడు పని చేస్తున్న రియాక్టర్ల సంఖ్యలో ఆరవ స్థానంలోనూ, నిర్మాణంలో ఉన్న వాటితో కలిపి మొత్తం రియాక్టర్ల సంఖ్యలో రెండవ అతిపెద్ద దేశంగా భారత్ ప్రపంచంలో అవతరించిందని మంత్రి వెల్లడించారు. ఈ రంగంపై మోదీ పాలన వేసిన ముద్ర ఏమిటంటే, తొలిసారి అణు ఇంధనాన్ని వివిధ రంగాలలోని అనువర్తనాల కోసం ఉపయోగించడం జరుగుతోందని చెప్పారు.
ఉదాహరణకు, ఆపిల్, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కాలం పెంచడానికి, కాన్సర్, ఇతర వ్యాధులు తదితరాల చికిత్సలో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడానికి ఉపయోగిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించే మార్గాలను భారత్ ప్రపంచానికి చూపిందని ఆయన పేర్కొన్నారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ