హూగ్లిలో ఆదివారం హింసాకాండ

శ్రీరామ నవవి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌  లోని హౌరా సహా పలు ప్రాంతాల్లో రెండ్రోజుల క్రితం చెలరేగిన అల్లర్లు ఇంకా సద్దుమణగముందే, తాజాగా హుగ్లీలో ఆదివారం సాయంత్రం మళ్లీ హింస చెలరేగింది. రామనవవి వేడుకలలో భాగంగా ఇక్కడ బిజెపి ఆధ్వర్యంలో సాగిన శోభాయాత్రపై కొందరు వ్యక్తులు రాళ్లురువ్వారు.

దీనితో పరస్పర ఘర్షణలు, పలు చోట్ల వాహనాల దగ్ధం పలువురు గాయపడటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిజెపి శోభాయాత్రపై కావాలనే దాడికి పాల్పడ్డారని ఓ వైపు ఆ పార్టీ వర్గాలు టిఎంసిపై విమర్శలకు దిగాయి.

శాంతిభద్రతల విచ్ఛిన్నానికి బిజెపి కావాలనే ఇటువంటి హింసాత్మక చర్యలకు ఆజ్యం పోస్తోందని అధికార టిఎంసి ఎదురుదాడికి దిగింది. ఈ వారం మొదట్లో రామనవమి ప్రదర్శన దశలో హౌరాలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఇప్పుడిప్పుడే హౌరాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న దశలో అక్కడికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోని హుగ్లీలో ఇప్పుడు ఉద్రిక్తత ఏర్పడింది.

హుగ్లిలో జరిగిన ప్రదర్శనకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు దిలీప్ ఘోష్ కూడా హాజరయ్యారు. ఘర్షణలు చోటుచేసుకోవడంతో ప్రజలు పరుగులు తీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాలకు పాకాయి. హుగ్లిలో జరిగిన ఘటనలపై బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ స్పందించారు. హింసాకాండకు బాధ్యులను గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకుంటారని, జైళ్లకు పంపిస్తారని హెచ్చరించారు.

ఉద్రిక్త ప్రాంతాలకు వెంటనే అదనపు బలగాలను తరలించారు. ఇటువంటి దౌర్జన్యకర చర్యలను సహించేది లేదు, గూండాయిజాన్ని పూర్తిగా అణిచివేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని అధికారపార్టీ ప్రకటనలతో నిమిత్తం లేకుండా గవర్నర్ స్వయంగా హెచ్చరికలు వెలువరించడం, పరిస్థితిని చక్కదిద్దుతామని తెలియచేయడం కీలక పరిణామాలకు దారి తీసింది.

తాజా అల్లర్లపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీష్ ఘోష్ మండిపడ్డారు. శోభాయాత్ర జరుగుతుండగా మహిళలు, పిల్లలపై రాళ్లు రువ్వారని, హౌరా హింసాకాండ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి అల్లర్లకు తావీయవద్దని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో అందరూ సహకరించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. పోలీసుల వైఫల్యాన్ని సీఎం అంగీకరిస్తూనే, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఘర్షణల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ఆమె తెలిపారు.

మమత బెనర్జీకి హిందువులంటే ద్వేషమని, అందుకే హుగ్లీలో శాంతియుత బిజెపి శోభాయాత్రపై దాడి చేయించారని బెంగాల్ బిజెపి అధ్యక్షులు సుకంత బెనర్జీ ఆరోపించారు. కాగా బిజెపి ఇతర మతసంస్థలే ఇప్పటి హింసాకాండకు కారణం అని సిఎం మమత బెనర్జీ విమర్శించారు. ఈ వాదనను తిప్పికొట్టిన స్థానిక బిజెపి వర్గాలు నిజానిజాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) సమగ్ర దర్యాప్తుతో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.