మస్కిటో కాయిల్ పొగ పీల్చి ఆరుగురు నిద్రలోనే మృతి

మస్కిటో కాయిల్ పొగ పీల్చి ఆరుగురు నిద్రలోనే మృతి
మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది. నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే మృత్యు ఒడిలోకి చేరుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు.

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ రోజు ఉదయం వాళ్లు ఎవరూ బయటకు రాలేదు.. దీనికితోడు ఇంట్లో నుంచి పొగ వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అందరూ స్పృహ లేని స్థితిలో ఉన్నారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

వారిలో ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాలిన గాయలైన మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందించారు. తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు.రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో దోమలు కుట్టకుండా ఉండేందుకు పెట్టుకున్న మస్కిటో కాయిల్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్ల కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఊపిరాడక నిద్రలోనే స్పృహ కోల్పోయారని భావిస్తున్నారు.

రాత్రి పూట వారు గది తలుపులు, కిటికీలు మూసి వేసి, మస్కిటో కాయిల్ వెలిగించారు. దీంతో గదిలో రాత్రంతా పొగ కమ్ముకుంది. కార్బన్ మోనాక్సైడ్ బయటకి వెళ్లే దారిలేక గదిలోనే పరుచుకుపోయింది. వారందరూ ఆ విషపూరిత వాయువును పీల్చడం వల్ల మృతి చెందారు’ అని ఢిల్లీ ఈశాన్య జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
 
కాలిపోతున్న మస్కిటో కాయిల్ వారు నిద్రిస్తున్న పరుపుపై పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పొగ కమ్ముకొని గది నిండా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రమాద తీవ్రతను పెంచి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ తర్వాత అది వారి మరణానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు.