త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం

ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోమారు విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.  ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య వారి చేత ప్రమాణం చేయించారు.

అగర్తలాలో జరిగిన సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. వాళ్లతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్, సిక్కిం సీఎం పీఎస్ తమంగ్ కూడా హాజరయ్యారు. 

మాణిక్ సాహా పోయినసారి ఉన్న మంత్రులు రతన్ లాల్ నాథ్, ప్రణజిత్ సింఘా రాయ్, శంతన చక్మా, సుశాంత చౌదరిలను ఈసారి కూడా కొనసాగించారు. వాళ్లతో పాటు ముగ్గురు కొత్త మంత్రులకు అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్‌కు సన్నిహితుడైన టింకు రాయ్, షెడ్యూల్డ్ తెగల మోర్చా చీఫ్ బికాష్ దేబ్బర్మ, సుధాన్షు దాస్ లకు మంత్రివర్గంలో స్థానం దక్కింది.

బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) పార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. ఆ పార్టీ నుంచి సుక్లా చరణ్ నోటియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో మొత్తం 60 సీట్లలో బిజెపి 32 సీట్లు గెలుపొందగా, మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ ఒక సీటును గెల్చుకుంది.

కాగా, 13 సీట్లు గెలుపొందిన గిరిజన రాజవంశంకు చెందిన ప్రద్యోత మాణిక్య దెబ్బర్మ నాయకత్వంలోని తిప్రా మోతాను కూడా మంత్రివర్గంలో చేరమని ప్రయత్నం చేస్తున్న బిజెపి నాయకత్వం వారికోసం మూడు మంత్రి పదవులను ఖాళీగా ఉంచినట్లు తెలుస్తున్నది.

ఇలా ఉండగా, ముఖ్యమంత్రి పదవి ఆశించిన కేంద్ర మంత్రి ప్రతిమ భౌమిక ఎంపీగా కొనసాగుతూ తాజా ఎన్నికలలో తాను గెలుపొందిన దంపూర్ అసెంబ్లీ స్థానంకు ఆమె రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.