నదీ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్రాలు నీటి నిల్వ వనరులను పెంచుకోకపోతే భవిష్యత్ లో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దేశంలో నదీ జలాల వినియోగంపై జలవనరుల నిపుణులతో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ సమర్పించిన నివేదికను సీడబ్ల్యూసీ విడుదల చేసింది.
నదీ జలాల్లో రాష్ట్రాలు కేవలం ఒక వంతు నీటిని మాత్రమే వినియోగించుకుంటుండగా రెండొంతుల జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నాయని వెల్లడించింది. దేశంలోని అన్ని నదుల్లో ఏటా 70,591.75 టీఎంసీల జలాలు అందుబాటులోకి వస్తుండగా, కేవలం 24,367.43 టీఎంసీల నీటిని మాత్రమే రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి.. 46,224.32 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి.
కడలి పాలవుతున్న జలాలను దారి మళ్ళించి నిల్వ సామర్ద్యాలను పెంచుకునేలా జలాశయాల విస్తరణ, కొత్త జలాశయాలను నిర్మించుకోకపోతే భవిష్యత్ లో సాగు, తాగునీటికి తీవ్రమైన ఎద్దడి ఏర్పడి వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముందని తెలిపింది. నీటి నిల్వ వనరులను పెంచుకోక పోవడం వల్ల జనాబా పెరిగే కొద్దీ తలసరి నీటి లభ్యత తగ్గపోతుంది.
ఇది ప్రమాదకర సంకేతమని నివేదికలో సీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, గంగ, బ్రహ్మపుత్ర తదితర నదుల ద్వారా ప్రవాహరూపంలో లభిస్తున్న 70, 591 టీఎంసీల జలాల్లో భారీ వృధా నమోదు కావటమే కాకుండా ఎక్కడికక్కడ వర్షపాత రూపంలో లభిస్తున్న 1.37 లక్షల టీఎంసీల వినియోగంలోనూ రాష్ట్రాలు పటిష్టమైన నీటి వనరులను ఏర్పాటు చేసుకోవటంలో విఫలమవుతున్నాయని సీడబ్ల్యూసీ తెలిపింది.
More Stories
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం