ప్రభుత్వ వ్యతిరేకతే తెలంగాణాలో బీజేపీ ఆయుధం

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమ ఆయుధమని, పోరాటంతోనే అధికారం చేపడతామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి మురళీధర్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు వ్యవహారశైలిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతకు ప్రాతినిథ్యం వహించేది  బిజెపి మాత్రమే అని భరోసా వ్యక్తం చేశారు.

పోరాటం చేసేవాళ్లను ప్రజలు గుర్తిస్తారని, ప్రస్తుతం ఆ గుర్తింపు బీజేపీకి దక్కుతోందని ఆయన తెలిపారు. అయితే క్షేత్ర స్థాయి వరకు ఈ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగల్గితే అధికారం సుసాధ్యమేనని తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గతంలో బీజేపీ ఎన్నికల గుర్తు కమలం గురించి ప్రజలకు పూర్తి అవగాహన లేకపోయిందని ఆయన చెప్పారు.

 కానీ గత రెండు మూడేళ్లుగా బూత్ కమిటీలు (శక్తి కేంద్రాలు) వేసి పార్టీ చేస్తున్న కసరత్తుతో పాటు ‘ప్రజా సంగ్రామ యాత్ర’, ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ (వీధి సమావేశాలు) వంటి కార్యక్రమాలతో ‘కమలం’ గుర్తు జనంలోకి చొచ్చుకెళ్లిందని ఆయన వెల్లడించారు. బీజేపీకి అభ్యర్థులు లేరన్న మాటను ఆయన కొట్టిపడేశారు.

 ప్రజా వ్యతిరేకతకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు నాయకులు ఉద్భవిస్తారని, ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి చేరతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు పార్టీల్లో చేరికలు లేవంటే బీజేపీలో చేరడానికి ఎవరూ సిద్ధంగా లేరని అనుకోవద్దని చెప్పారు. చాలా మంది నేతలు కమలనాథులతో మంతనాలు సాగిస్తున్నారని మురళీధర్ రావు వెల్లడించారు.

మరోవైపు ఏ పార్టీ అయినా తాము ఎదగాలని కోరుకుంటుందని, ఆ క్రమంలో ఆ పార్టీ పొందే ఓట్లు మరో పార్టీ ఓట్లను చీల్చినట్టుగా లెక్కగట్టడం సహజమని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీపై యుద్ధం చేస్తోందని, ఇందుకోసం కాంగ్రెస్ పార్టీతో పోటీపడుతోందని ఆయన చెప్పారు. తాము ఎదిగే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఓటును చీల్చినంత మాత్రాన బీజేపీకి బీ-టీమ్‌ అంటూ ప్రచారం చేయడం తగదని హితవు చెప్పారు.

తొలినాళ్లలో తాము కాంగ్రెస్‌పై యుద్ధం చేస్తున్నప్పుడు సోషలిస్టు పార్టీలతో పోటీపడాల్సి వచ్చేదని, అప్పుడు కూడా ఇలాగే అనుకునేవారని గుర్తుచేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్నంత వేగంగా జాతీయస్థాయిలో సంస్థాగతంగా బలోపేతమై, బీజేపీ వ్యతిరేక ఓటుతో ఎదుగుతుంది అనుకోవడం హాస్యాస్పదమని మురళీధర్ రావు స్పష్టం చేశారు.

చరిత్రలో పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలో అధికారం సాధించిన సందర్భం ఏదైనా ఉంటే అది ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడే జరిగిందని, కానీ అలాంటి ఉదాహరణలు ఎక్కువ లేవని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ తరహాలో చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నారని, కానీ బీఆర్ఎస్ ప్రచారానికి తప్ప ఎన్నికల ఫ్యాక్టర్ కాబోదని తేల్చి చెప్పారు.

తెలంగాణ బీజేపీలో గ్రూపులు, అంతర్గత విబేధాలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మురళీధర్ రావు కొట్టిపడేశారు. పార్టీలో ముందు నుంచి ఉన్నవాళ్లతో పాటు కొత్తగా చేరినవాళ్లు చేసేది బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటమేనని, అందరి లక్ష్యం బీఆర్ఎస్‌ను ఓడించమేనని తెలిపారు. ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు గ్రూపులు కట్టే పరిస్థితి ఉండదని చెప్పారు. బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటంలో అన్నింటినీ సమన్వయం చేయగలిగే శక్తి బీజేపీ అధినాయకత్వానికి ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా నిష్కల్మషమైన అవినీతి రహిత రాజకీయాలకు మారుపేరు అని మురళీధర్ రావుగుర్తు చేశారు. అదానీ – హిండెన్‌బర్గ్ విషయంలో ఎంత దుష్ప్రచారం చేసినా ఆ ప్రభావం ప్రధానిపై ఉండబోదని భరోసా వ్యక్తం చేశారు. సాంకేతికంగా ప్రభుత్వం అదానీకి ఎలాంటి లబ్ది చేకూర్చలేదని, ఆ సంస్థకు రుణాలిచ్చిన ఎల్ఐసీ లేదా బ్యాంకులు సైతం తమ నిబంధనల ప్రకారమే ఇచ్చాయని ఆయన చెప్పారు.