త్వరలో భారతదేశంలో క్యాన్సర్ సునామీ!

త్వరలో భారతదేశంలో క్యాన్సర్ సునామీ!
త్వరలో భారతదేశంలో క్యాన్సర్ సునామీ రాబోతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు. రాబోయే ఐదేళ్లలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని స్పష్టం చేశారు. క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసిన టీటీడీ ఆయుర్వేద హాస్పిటల్ వైద్యులు  ఈ సంచలన ప్రకటన చేశారు.
 
జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే క్యాన్సర్ దాడి తప్పదని వారు హెచ్చరించారు. ‘జీవనశైలి వ్యాధులకు ఆయుర్వేద పరిష్కారం’ పేరుతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఒబెసిటీ, డయాబెటిస్, హైపర్‌ టెన్షన్, కార్డియాక్ సమస్యలకు ఆయుర్వేదం ద్వారా ఇంటి వైద్యంతోనే చెక్‌ పెట్టొచ్చని ఎస్వీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ స్పష్టం చేశారు.
 
అలోపతి వైద్యం తీసుకుంటున్న వారు కూడా ఆయుర్వేద మందులు వాడొచ్చని, తద్వారా జబ్బు మరింత తీవ్రం కాకుండా చూడొచ్చని ఆమె వివరించారు. నల్లేరు, అలోవెరా, ఆమ్లా, అర్క, జిల్లేడు లాంటి మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని వివరించారు. త్వరలోనే టిటిడి ఆయుర్వేదిక్ ఫార్మసీ సెంటర్ 314 రకాల మందులు తీసుకురానున్నట్టు ఆమె వెల్లడించారు.
 
జీవితంలో ఆరోగ్య క్రమశిక్షణ అంతర్భాగం కావాలని, తద్వారా ఆరోగ్యకరమైన మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని హైదరాబాదుకు చెందిన నిమ్స్ చీఫ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు. డయాబెటిస్ వ్యాధిని నిశ్శబ్ద సునామీగా అభివర్ణించారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలని, త్వరగా గుర్తిస్తే ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చని చెప్పారు.
 
గుండెపోటు వచ్చిన సమయంలో బాధితుడికి ప్రాథమికంగా ఎలాంటి చికిత్స అందించాలో  డాక్టర్ సుభాషిణి వేదికపైనే నమూనా ప్రదర్శనతో చూపించారు. అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో ఆమె  వివరించారు. అందరూ దీనిపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.
 
చీజ్, సాల్ట్ వేసిన వేరుశెనగలు, పాస్తా సాస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో చాలా కృత్రిమ రంగులు, రుచులు, స్వీటెనర్లు, ప్రిరెజర్వేటివ్‌లు ఉంటాయని ఆమె వివరించారు. వీటిని తీసుకోవడం వల్ల అండాశయం, మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని ఆమె చెప్పారు. వారసత్వంగా వచ్చే క్యాన్సర్లను నివారించడం కష్టమే కానీ.. జీవనశైలి వల్ల వచ్చే క్యాన్సర్లను అడ్డుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

ఎస్‌వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ సాధారణ వ్యాధులకు వేదాల్లో పేర్కొన్న మూలిక, మంత్ర ఆధారిత చికిత్స పద్ధతులను తెలియజేశారు. గరుడ పురాణంలో మానవులకు సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులను తెలియజేశారని చెప్పారు. అరుణ పారాయణం ద్వారా డి విటమిన్ లభిస్తుందని, మహా మృత్యుంజయ మంత్రం ద్వారా అనారోగ్యం తొలగిపోతుందని తెలియజేశారు.

స్విమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వనజాక్షమ్మ మాట్లాడుతూ ఒత్తిడి నివారణ ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని ఎలా అలవాటు చేసుకోవాలి అనే విషయాలను తెలియజేశారు. యోగ, ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక వికాసం కలుగుతుందని చెప్పారు. అనంతరం ఉద్యోగులతో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదేక ప్రతాప్ పలు యోగాసనాలు, ముద్రలు చేసి చూపి వాటి వల్ల కలిగే ఉపయోగాలను తెలియజేశారు.