ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‍వే తొలి దశ తొలి దశ ప్రారంభించిన ప్రధాని

రూ. లక్ష కోట్ల వ్యయంతో చేపట్టిన ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‍వే తొలి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. అధునాతన హైటెక్ సదుపాయాలు, వన్య ప్రాణుల కోసం ఓవర్ పాస్‍లు, అండర్ పాస్‍లతో సహా సహా ఎన్నో ప్రత్యేకతలతో 1,386 కిలోమీటర్ల పొడవున ఈ ఎక్స్‌ప్రెస్‍వే నిర్మితమవుతోంది.
 
ఈ ఎక్స్‌ప్రెస్‍వేలో తొలి దశగా ఢిల్లీ – దౌసా – లాల్‍సోత్  సెక్షన్ 246 కిలోమీటర్ల మార్గాన్ని ప్రధాని మోదీ నేడు ఆరంభించారు. మధ్య ప్రదేశ్‍లోని దౌసాలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ మార్గం ద్వారా ఢిల్లీ నుంచి జైపూర్‌కు కేవలం మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. “దేశం కోసం.. అందరితో కలిసి, అందరి అభివృద్ధి అనేదే మా మంత్రం. దాన్ని అనుసరిస్తూనే సామర్థ్య భారతాన్ని నిర్మిస్తున్నాం. మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి” అని ఈ హైవే తొలి దశ ప్రారంభ కార్యక్రమంలో మోదీ తెలిపారు.

కేంద్ర రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు వీకే సింగ్, గజేంద్ర సింగ్ సహా మరికొందరు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి ముంబైకు 12 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సమయం 24 గంటలుగా ఉంది.

అంటే ఈ ఎక్స్‌ప్రెస్‍వే అన్ని దశలు పూర్తయితే ప్రస్తుతం ఉన్న దాని కంటే సగం సమయంలోనే ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ఉన్న రోడ్డు మార్గం ఈ ఎక్స్‌ప్రెస్‍వే వల్ల 1,424 కిలోమీటర్ల నుంచి 1,242కు తగ్గనుంది. ఇక నేడు ప్రారంభించిన తొలి దశ వల్ల ఢిల్లీ – జైపూర్‌ మధ్య రవాణా సమయం 5 గంటల నుంచి 3 గంటలకు తగ్గుతుంది.

మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల మీదుగా ఈ ఢిల్లీ – ముంబై హైవే వెళుతోంది. కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదర, సూరత్ లాంటి కీలక నగరాల మీదుగా ఉంది. ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‍వే 8 లేన్లుగా ఉంది. భవిష్యత్తులో 12 లేన్లకు విస్తరించే సదుపాయం కూడా ఉంటుంది.

సుమారు రూ.లక్ష కోట్ల నిధులను వెచ్చించి గతిశక్తి పథకం కింద ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‍వేను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. 2018లో రూ.98,000 కోట్లతో ప్రణాళిక రచించింది. ఇది కాస్త అధికమైనట్టు సమాచారం. ప్రధాని మోదీ నేడు ప్రారంభించిన ఢిల్లీ – దౌసా – లాల్‍సోత్ తొలి దశకు రూ.12,150 కోట్లు ఖర్చయింది.

2018లో మంబై – ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‍వే నిర్మాణాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ హైవే కోసం 12 లక్షల టన్నుల స్టీల్‍ను వినియోగిస్తోంది. హోరా బ్రిడ్జికి ఉండే స్టీల్‍తో పోలిస్తే ఇది 50 రెట్లు. ఈ హైవే వల్ల వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్రం.

వన్యప్రాణులు రాకపోకలు కొనసాగించేందుకు వీలుగా ఈ ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‍వేను ఓవర్ పాస్, అండర్ పాస్‍లతో నిర్మిస్తోంది. వీటిపై వన్యప్రాణాలు సంచరించవచ్చు. రోడ్ల మీదికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇలా వన్యప్రాణుల కోసం ప్రత్యేక మార్గాలతో ఆసియాలో నిర్మితమైన తొలి హైవేగా ఇది నిలిచింది.