తగిన వధువు కోసం మాండ్యలో బ్రహ్మచారుల పాదయాత్ర!

తగిన వధువు కోసం మాండ్యలో బ్రహ్మచారుల పాదయాత్ర!

దాదాపు 200 మంది కర్ణాటకలోని మాండ్యకు చెందిన బ్రహ్మచారులు చామరాజనగర్ జిల్లా నుంచి  ఎంఎం హిల్స్‌ గుడికి పాదయాత్ర చేపట్టనున్నారు. వారు తమకు తగిన వధువును దొరికేలా చేయమని దేవుని కోరుకుంటున్నారు. వారు ఫిబ్రవరి 23న మద్దూరు తాలూకలోని కెఎం. దొడ్డి నుంచి ఈ యాత్ర చేపట్టనున్నారు.

వారు మూడు రోజుల్లో 105 కిమీ. దూరాన్ని ఈ పాదయాత్ర ద్వారా కవర్ చేయనున్నారు. మాండ్యలోని యువకులు వ్యవసాయం పనుల్లో నిమగ్నమై ఉండడంతో వారికి సరైన వధువులు దొరకడం లేదని సమాచారం. ప్రధానంగా ఆ జిల్లాలో ఆడ భ్రూణ హత్యలు చోటుచేసుకోవడం వల్ల స్త్రీ పురుష నిష్పత్తి దెబ్బతిన్నది.

ఇప్పుడు కర్నాటక గ్రామాలు భ్రూణ హత్యలకు మూల్యం చెల్లించుకుంటున్నాయని అక్కడి మహిళా రైతులు భావిస్తున్నారు. గ్రామాల్లో ఉండడానికి, రైతులను పెళ్లాడడానికి మాండ్యలోని యువతులు ఇష్టపడకపోవడం కూడా మరో కారణమని ఇంకో వర్గం భావిస్తోంది. ఇక చేపట్టబోయే పాదయాత్రలో పాల్గొనే యువకులు ‘బ్రహ్మచారుల పాదయాత్ర’ అని తమ పాదయాత్రకు పేరుపెట్టుకున్నారు.

వారంతా 30 ఏళ్ల పడిలో ఉన్న యువకులే. ఈ యాత్రలో పాల్గొనేందుకు తొలి పది రోజుల్లోనే వంద మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ యాత్రలో స్థానికులే కాక బెంగళూరు, మైసూరు, మాండ్య, శివమొగ్గ జిల్లాల నుంచి కూడా యువకులు పాల్గొనేందుకు రిజిష్టరు చేసుకున్నారు.  ఈ యాత్రలో పాల్గొనే యువకుల నుంచి ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. ఈ యాత్ర నిర్వహించే ముఖ్యోద్దేశం ‘పెళ్లి కాని యువకుల మానసిక క్షోభను తొలగించడమే’ అని నిర్వాహకులు అంటున్నారు. నేడు ‘రాక్షస వివాహాల’కు ఛాన్స్ లేదుగా మరి!