ఆమ్రపాలి గ్రూప్‌ ఎండీ అనిల్‌ శర్మపై హత్య కేసు

ఆమ్రపాలి గ్రూప్‌ ఎండీ అనిల్‌ శర్మపై హత్య కేసు
దేశంలో ప్రముఖ సంస్థ అయిన ఆమ్రపాలి గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ అనిల్‌ శర్మపై హత్య కేసు నమోదయింది. బీహార్‌లోని లఖిసరాయ్‌లో ఉన్న బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్‌ శరత్‌ చంద్ర హత్య కేసులో ఆయన హస్తం ఉన్నదని కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) పేర్కొన్నది. విద్యాపీఠానికి చెందిన భూములు, ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనిల్‌ శర్మతోపాటు మరో ఐదుగురు కుట్రపన్నారని, అందులో భాగంగా ఈ హత్య జరిగిందని తెలిపింది. 
లఖిసరాయ్‌లోని బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్‌ శరత్‌ చంద్ర 2014, ఆగస్టు 8న దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భార్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. దీంతో గత నెల రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. బాలికా విద్యాపీఠ్‌, లఖిసరాయ్‌ భూములు, ఆస్తులను లాక్కోవాలనే ముందస్తు కుట్రలో భాగంగానే శరత్‌ చంద్ర హత్య జరిగిందని తేల్చింది.

ఇందులో భాగంగా అనిల్‌ శర్మ, మరికొందరి సహాయంతో ఆయనను కార్యదర్శి పదవి నుంచి తొలగించారని, అనంతరం విద్యా సంస్థకు చెందిన భూములు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని తెలిపింది.

అయితే విద్యా సంస్థ నిర్వహణ విషయంపై ఆయన తరచూ ప్రశ్నిస్తుండటంతో చంద్ర అడ్డును తొలగించుకోవాలని ప్లాన్‌ వేశారని వెల్లడించింది. ఇందులో భాగంగా 2014, ఆగస్టు 8న తన ఇంట్లోని బాల్కనిలో వార్తా పత్రిక చదువుకుంటుండగా  కొందరు దుండగులు చంద్ర ఇంటిపై దాడి చేశారని పేర్కొంది. అనంతరం ఆయనను కాల్చి చంపారని తెలిపింది.