అయ్యప్ప స్వాముల మీద ఘోరంగా మాట్లాడిన వ్యక్తిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ డిమాండ్ చేశారు. 24 గంటల లోగా చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కొత్త డీజీపీ అంజనీ కుమార్లను కోరారు.
24 గంటల్లో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో లక్షల్లో ఉన్న అయ్యప్ప స్వాములు రోడ్డు మీదకు వచ్చి,ప్రగతిభవన్ను ముట్టడిస్తారని రాజాసింగ్ హెచ్చరించారు. కొడంగల్లో జరిగిన ఓ సభలో ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు నరేష్ అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల స్వాములు, హిందూ దేవతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ మండిపడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు.
‘హిందూ దేవతలు, దేవుళ్ల మీద నరేష్ తప్పుగా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు 45 రోజుల పాటు శుద్దితో, భక్తితో పూజలు చేస్తారు. శబరిమల వెళ్లి ఎంతో కష్టపడి స్వామివారి దర్శనం చేసుకుంటారు’ అని అందులో తెలిపారు.
“అయ్యప్పస్వామి గురించి మాట్లాడటానికి నీకు బుద్ది ఉందా? ఎంతోమంది స్వాములు రోడ్డుపైకి వచ్చి నిన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవుళ్ల గురించి కించపరుస్తూ మాట్లాడిన నరేష్పై చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా” అని రాజాసింగ్ తన వీడియోలో పేర్కొన్నారు.
“నేను ఎవరిపైనా కామెంట్ చేయకపోయినా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు…. మా అయ్యప్ప స్వాముల మీద ఘోరంగా మాట్లాడిన వ్యక్తిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తారా?.. కేసీఆర్, కేటీఆర్, అంజనీ కుమార్కు 24 గంటలు టైమ్ ఇస్తున్నా.. ఇలాంటి వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించాలి. పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నా” అని రాజాసింగ్ తెలిపారు.
More Stories
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్