
ఉత్తర ప్రదేశ్లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలని మధుర కోర్టు శనివారం ఆదేశించింది. హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీనియర్ డివిజన్ కోర్టు ఈ కేసులోని అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కోరింది.
జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల తరహాలోనే మధుర కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. వీడియోగ్రాఫిక్ సర్వే నిర్వహించాలని జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణ జన్మస్థానం-షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద స్థలంపై హిందూ సేన వాదనపై అమీన్ జనవరి 2 తర్వాత సర్వే జరపాలని మధుర కోర్టు శనివారం ఆదేశించింది.
ఈ సర్వే నివేదికను జనవరి 20న సమర్పించాలని ఆదేశించింది. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త, ఉపాధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ డిసెంబరు 8న కోర్టులో వాదనలు వినిపిస్తూ, శ్రీకృష్ణుని జన్మస్థానానికి చెందిన భూమిలో 13.37 ఎకరాల స్థలంలో ఉన్న దేవాలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూలగొట్టాడని, దానిపై ఈద్గాను నిర్మించాడని తెలిపారు.
ఈ నేతలిద్దరూ ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ మసీదు ఈద్గా 1968లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ఈ పిటిషన్ సవాల్ చేసింది. మూడో సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి సోనికా వర్మ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
More Stories
భారత్ అమ్ములపొదిలో చేరనున్న ధ్వని మిస్సైల్
బీజాపూర్ లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు