తెలంగాణలో కుటుంబ పాలన పోవాల్సిందే

తెలంగాణలో కుటుంబ పాలన పోవాల్సిందే
తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన పోవాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బేగంపేటలో బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ అవినీతి, కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువని మోదీ  చెప్పారు.
 
అవినీతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు బిజెపి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణలో చీకటి తొలగిపోయే రోజు దగ్గర్లోనే ఉందని భరోసా వ్యక్తం చేస్తూ  తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 
 
దేశంలో ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ కమలం వికసిస్తుందని పేరొక్నటు తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పేదల ఎదుగుదలకు అవినీతే అడ్డు అంటూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. 
 
మునుగోడు ప్రజలు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని  పేర్కొంటూ ఒక్క అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్నే ఒకే చోటుకు చేర్పించిన ఘనత బిజెపి కార్యకర్తలదని కితాబిచ్చారు. ప్రజల ఆశీస్సులు మీకు ఉన్నాయనే విషయం దీంతో అర్థమవుతోందని అంటూ మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందని భరోసా ఇచ్చారు. 
 
తెలంగాణ ప్రజలు అత్యంత ఎక్కువగా నమ్మిన పార్టీ (టిఆర్ఎస్)… చివరకు ఆ ప్రజలను దారుణంగా మోసం చేసిందని ప్రధాని విమర్శించారు. కొందరు తనను తిట్టడం కోసం డిక్షనరీలను వెతుకుంటున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.  తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీ.. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు.
22 ఏళ్లుగా తాను తిట్లు తింటూనే ఉన్నానని, ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని చెప్పారు. కొంతమంది నిరాశవాదులు అదే పనిగా తిడుతుంటారని, రాష్ట్ర పాలకులకు తనను తిట్టడమే తెలుసని ధ్వజమెత్తారు.  రోజుకు మూడు కేజీల తిట్లు తింటానని చెబుతూ ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని తెలిపారు. తనను తిడితేనే రైతులు బాగుపడతారంటే తిట్లు తినడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు.
అయితే,  తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించేది లేదని,  తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని మోదీ  హెచ్చరించారు. పసుపు రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమను వడ్డీతో సహా చెల్లిస్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ ఐటీకి కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఇలాంటి నగరంలో టిఆర్ఎస్ పార్టీ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తోందని ప్రధాని విమర్శించారు. మూఢనమ్మకాలు అభివృద్ధికి అవరోధకాలని పేర్కొంటూ మంత్రులను తీసుకోవడం తీసేయడం కూడా మూఢవిశ్వాసాలతో చేస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు.
 
1984లో బిజెపికి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, వీరిలో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారని అప్పడు హటు న్మకొండ నుంచి జంగారెడ్డిని ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మోదీ భరోసా ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పీఎం ఆవాస్ యోజన పథకాన్ని టిఆర్ఎస్ పథకం అడ్డుకుందని విమర్శించారు. 
 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బిజెపి శ్రేణులు ప్రజలకు వివరించాలని ప్రధాని  సూచించారు. తెలంగాణ కార్యకర్తల పోరాటం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ వికసించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కష్ట సమయంలో జనం బీజేపీకి అండగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. 
ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలతో మోడీ మోడీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి మోడీ సంతోషం వ్యక్తం చేశారు.