
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12న రామగుండంకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున జనసమీకరణకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.
గతంలో మూతబడిన రామగుండం ఎఫ్సీఐ పునరుద్ధరణకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తం రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్ఎఫ్ సిఎల్ ను కేంద్ర ఎరువుల, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఇటీవలే సందర్శించారు.
ప్రధాని రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు కనీవినీ ఎరగని రీతిలో భారీగా జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది. కనీసం లక్ష మందికి తగ్గకుండా బహిరంగ సభను విజయవంతం చేయాలని భావిస్తోంది. ఈ సభకు భారీ ఎత్తున రైతులను భారీగా తరలించాలని నిర్ణయించారు.
ప్రధాని రాక నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంపీ సోయం బాబూరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్, మాజీ మంత్రులు జి.విజయరామారావు, సుద్దాల దేవయ్య, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జన సమీకరణ, సభ విజయవంతం విషయంలో జిల్లా నాయకులంతా సమన్వయంగా పనిచేయాలి. ప్రధానికి భారీ స్వాగతం పలికేలా తెలంగాణ అంతటా వివిధ రూపాల్లో అలంకరణ చేయాలి. అన్ని నియోజకవర్గాలు రైతులు, కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలని సంజయ్ సూచించారు.
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించడంవల్ల రైతులకు కలిగే ప్రయోజాలను వివరించాలని ఆయన చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్దరణ ద్వారా తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారత రైతులందరికీ కొరత లేకుండా ఎరువులను సరఫరా చేయబోతున్నారని అవగాహన కల్పించాలని తెలిపారు.
మోదీ ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదన్నదానికి ఇదే నిదర్శనం అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో ఏటా వేలాది కోట్లు ఖర్చు పెట్టి సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
More Stories
జూబ్లీ హిల్స్ లో బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
తెలంగాణాలో ముస్లిం అరాచక శక్తులు విశృంఖల విహారం
దీపావళి రోజున రేవంత్ ఇంటికి కొండా దంపతులు