వంతెన కూలి పోవడంతో  బిజెపి ఎంపీ కుటుంభం సభ్యులు 12 మంది మృతి 

వంతెన కూలి పోవడంతో  బిజెపి ఎంపీ కుటుంభం సభ్యులు 12 మంది మృతి 

గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలిన ఘటనలో రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలతో సహా తన కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయానని ఆయన మీడియాతో చెప్పారు. 

తన సోదరి కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులను కోల్పోయానని మోహన్‌భాయ్ కళ్యాణ్‌ కుందారియా అన్నారు. ప్రమాదం నేపథ్యంలో గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు. 

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ రేపు ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ సీఎంవో కార్యాలయం వెల్లడించింది.  బ్రిడ్జి కూలిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ విచారణ చేస్తోందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.  

కేబుల్ బ్రిడ్జి ఘటన అనంతరం అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు.

ఇలా ఉండగా, ఆ వంతెన పైకి ఎక్కినపుడు కొందరు యువకులు ఉద్దేశపూర్వకంగా బ్రిడ్జిని షేక్ చేస్తూ పర్యాటకుల్ని భయాందోళనలకు గురి చేయడంతో ఘటనకు కొన్ని గంటలకు ముందే అక్కడి నుండి వచ్చేశామని ఓ కుటుంభం చెప్పింది. వారు ఆ వంతెను గట్టిగా తన్నారని, అది ప్రమాదకరమని భావించి, తామంతా అక్కడి నుంచి వెనక్కి వచ్చినట్టు చెప్పారు.