నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు అందజేసింది. 8 మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, రేణుకాచౌదరి, గీతారెడ్డిలతో  సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది.  అక్టోబర్‌ 10న ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే తమకు ఇంకా నోటీసులు అందలేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులను ఈడీ విచారించింది.
ఈ విషయమై అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను విరాళం ఇచ్చానని, అయితే ఈ కేసులో ఈడీ నుంచి తనకు ఏలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. గీతా రెడ్డి సైతం తనకు ఇప్పటి వరకూ ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఈడీ నోటీసుల విషయంపై స్పందించిన షబ్బీర్ అలీ తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. ఒకవేళ నోటీసులు వస్తే విచారణకు హాజరు అవుతానని కూడా తెలిపారు.

మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సైతం తాను నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సహాయం చేశానని, అది చెక్కు రూపంలోనే ఇచ్చానని తెలిపారు. ఈ కేసు విషయమై ఎలాంటి విచారణకైనా సిద్ధమని వెల్లడించారు.