ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్ట్ లో బెయిల్

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్ట్ లో బెయిల్

ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై అరెస్టయిన  గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ, వెంటనే విడుదల చేయమని ఆదేశించింది.  తొలుత బెయిల్ తిరస్కరిస్తూ  14 రోజుల రిమాండ్‌ విధించింది. రాజాసింగ్‌ తరపు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా  కోర్టు తిరస్కరించింది.

నమోదైన కేసులన్నీ బెయిలబుల్ కేసులని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్‌ చేయడం చట్టవిరుద్దమని అంటూ 41 సీఆర్పీసీపై  రాజాసింగ్‌ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు.

రాజాసింగ్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు   శాంతి భద్రతల పరిరక్షణ కోసం.. ఉద్రిక్తతలను నివారించేందుకు రిమాండుకు పంపాలన్న ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు ఏకీభవించలేదు. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే పోలీసుల విచారణకు ఎమ్మెల్యే రాజాసింగ్ సహకరించాలని చెప్పింది.

శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే రాజాసింగ్ ను అరెస్టు చేశామని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించారు. రాజాసింగ్ కు బెయిల్ ఇస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని.. శాంతిభద్రతలు లోపిస్తాయని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు.  ప్రాసిక్యూషన్ వాదనలను రాజాసింగ్ న్యాయవాది వ్యతిరేకించారు.

కాగా మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై  రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే రాజాసింగ్‌పై 12 కేసులు నమోదవడం గమనార్హం. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరుచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించింది.

అంతకుముందు నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా కోర్టు వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు కోర్టు బయట ఎంఐఎం పార్టీ అనుచరులు కూడా ఆందోళన చేపట్టారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. రాజాసింగ్‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ, కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

ఇలా ఉండగా, టీఆర్‌ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం  దగ్గర  సోమవారం  అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై 29 మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. బీజేపీకి, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే.. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిని తరిమేశారు.

ఈ ఘటనలో ఐపీసీ సెక్షన్లు 341, 147 (అల్లర్లకు పాల్పడడం), 148 (మారణాయుధాలు కలిగి ఉండడం), 353, (దాడి లేదా నేరపూరితం), 332, 509 (ఏ మహిళను అయినా అవమానించాలనే ఉద్దేశ్యం) 149, వంటి సెక్షన్ల కింత కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పిసి) సెక్షన్ 41 కింద వారికి నోటీసు ఇచ్చి, అందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతారు.

అయితే.. దీనిపై కేసు నమోదైందని, తాము ఇంకా వారిని అరెస్టు చేయలేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.