ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన జగ్​దీప్​ ధన్‌కర్‌

భారత దేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగ్​దీప్​  ధన్‌కర్‌​ గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ధన్‌కర్‌   చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతుల, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు , విపక్ష నేతలు, ఎంపీలు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారానికి ముందు  ధన్‌కర్‌   రాజ్​ఘాట్​ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌ఖడ్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై గెలుపొందారు. వృత్తి రీత్యా న్యాయవాది. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు.
1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్‌ రాజస్థాన్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 
జనతాదళ్‌ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి జగదీప్ ధన్కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది. 
జగదీప్ ధన్కర్ రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. అంతే కాదు కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు. రాజస్థాన్ నుంచి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనవారిలో జగదీప్ ధన్‌కర్ రెండోవారు. 2002 నుంచి 2007 వరకు ఆ రాష్ట్రానికి చెందిన భైరాన్ సింగ్ షెకావత్ ఈ పదవిని నిర్వహించారు.
ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈసారి లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్మన్ పదవులను నిర్వహిస్తున్న ఇద్దరూ రాజస్థాన్‌కు చెందినవారే కావడం విశేషం.