గల్వాన్ అమరవీరులకు రాజ్‌నాథ్ నివాళి

గల్వాన్ లోయలో రెండేళ్ల క్రితం చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసి అమరులైన గల్వాన్ అమరవీరులకు స్మరించుకుంటూ వారి ధైర్య పరాక్రమాలను, దేశం కోసం వారు చేసిన ప్రాణత్యాగాన్ని ఎన్నటికీ మరువలేమని పేర్కొంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
 ప్రస్తుతం ఆయన జమ్మూ కశ్మీరులో పర్యటనలో ఉన్నారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలు చెలరేగి 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ పరిణామంతో తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ఘర్షణల్లో ఐదుగురు చైనా సైనికాధికారులు మరణించినట్లు గత ఏడాది ఫిబ్రవరిలో చైనా అధికారికంగా ప్రకటించింది.
గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా సైనికుల దురాక్రమణను వీరోచితంగా అడ్డుకున్న భారత సైనికులకు సారథ్యం వహించి అమరుడైన 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బి సంతోష్ బాబుకు గత ఏడాది నవంబర్‌లో భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత సైనిక పురస్కారం మహావీర్ చక్రను మరణానంతరం అందచేసింది. తూర్పు లడఖ్‌లోని 120 పోస్టు వద్ద గల్వాన్ అమరవీరుల స్మారకార్థం ఒక గాలంట్స్ ఆఫ్ గల్వాన్‌ను సైన్యం నిర్మించింది.

భారత్ నెత్తురోడాలనే పాక్‌

కాగా, భారత్ వేయిగాట్లతో నెత్తురోడాలనే విధంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. పలు విధాలుగా పొరుగు దేశం అయిన భారత్‌ను దెబ్బతీయాలనేదే పాకిస్థాన్ సంకల్పం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాకిస్థాన్ దుశ్చర్యలు సహించేది లేదని, గట్టి జవాబు ఇవ్వడం జరుగుతుందని హెచ్చరించారు.
దేశ ఐక్యత సమగ్రతలను గాయపర్చే విధంగా వ్యవహరిస్తే పాకిస్థాన్‌కు చుక్కలు చూపుతామని ఆయన హెచ్చరించారు. బారాముల్లా జిల్లాలో రక్షణ మంత్రి భద్రతా బలగాలను ఉద్ధేశించి మాట్లాడుతూ తరచూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు దిగడం పాకిస్థాన్‌కు పరిపాటి అయిందని మండిపడ్డారు.
 జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద చర్యలతో తల్లడిల్లిందని చెబుతూ తన వైఖరితో పాకిస్థాన్ ఎప్పుడూ భారత్ గాయపడేలా చేయాలని అనుకుంటూ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది దుస్సాహాసమే అవుతుందని, దీనికి తగు విధంగా గుణపాఠం చెప్పడం జరుగుతుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రెండు రోజుల పర్యటనకు వచ్చారు.