బిజెపి నేత రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్టు డ్రామా

బిజెపి నేత రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్టు డ్రామా
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, తెలంగాణ ఉద్యమ కళాకారుడు దరువు ఎల్లన్నను మంగళవారం హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేయడం నాటకీయంగా మారింది.  నోటీసులు ఇస్తామని పోలీస్‌స్టేషన్‌కు రావాలని పిలిచి అదుపులోకి తీసుకోవడంతో వారు నిరసనకు దిగారు. బీజేపీ నేతలు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దీంతో హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వద్ద ఐదు గంటలపాటు హైడ్రామా నెలకొంది. ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన అమరుల యాది సభలో సీఎం కేసీఆర్‌ను అవమానపరిచేలా ప్రదర్శన నిర్వహించారంటూ కేసు నమోదైంది. 
 
 ఏ1గా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆదివారం వనస్థలిపురంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పోలీసులు నోటీసులు అందజేశారు.  ఏ2 జిట్టా బాలకృష్ణారెడ్డిని ఈ నెల 10న ఘట్‌కేసర్‌ టోల్‌గేటు వద్ద అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
ఏ3గా ఉన్న రాణి రుద్రమకు, ఏ4గా ఉన్న కళాకారుడు దరువు ఎల్లన్న అలియాస్‌ బొడ్డు ఎల్లన్నకు మంగళవారం హయత్‌నగర్‌ పోలీసులు ఫోన్‌ చేశారు. 41(ఎ) సీఆర్‌పీసీ నోటీసు ఇస్తామని, స్టేషన్‌కు వచ్చి తీసుకోవాలని చెప్పారు.  దీంతో వారిద్దరు కలిసి ఉదయం 10.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. 
 
వెంటనే వారిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.  నోటీసులు ఇస్తామని పిలిపించి అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించడంతో రాణి రుద్రమ, దరువు ఎల్లన్న కంగుతిన్నారు. నేలపై కూర్చుని నిరసన తెలిపారు.
కాగా, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు దరువు ఎల్లన్నను స్టేషన్‌లో రెండు గంటలపాటు విచారించారు. డ్రామాలో ఎవరెవరున్నారో పేర్లు చెప్పాలని అడిగారు. ఆయన ఇద్దరి పేర్లు చెప్పగా మొత్తం అందరి పేర్లు చెప్పాలని అడిగారు. దీంతో తనకు తెలియదని ఆయన సమాధానం చెప్పారు.
నోటీసులు ఇచ్చిన తరువాత ఎలా అరెస్టు చేస్తారని బీజేపీ తరఫు న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అరెస్టుల సమాచారాన్ని అందుకున్న బీజేపీ కార్పొరేటర్లు నవజీవన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు  సీనియర్‌ నాయకుడు కళ్లెం బాల్‌రెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఒక దశలో రాణి రుద్రమను వదిలి ఎల్లన్నను అదుపులో ఉంచుకుంటామని చెప్పడంతో బీజేపీ నాయకులు అంగీకరించలేదు. చివరకు 3 గంటలకు ఎల్లన్నకు కూడా పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి వదిలిపెట్టారు.  అనంతరం రాణి రుద్రమ, ఎల్లన్న మాట్లాడుతూ సమైక్యవాదులు కేసులు పెడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. కేసులకు భయపడేది లేదని, త్వరలో జిల్లాల్లో, మండలాల్టో నాటకాలు, ప్రదర్శనలు ఇస్తామని, ఏం చేస్తారో చూస్తామని అంటూ ఆమె హెచ్చరించారు.