10 ఎన్‌జీవోలపై ఎఫ్‌సీఆర్ఏ అక్రమాల కేసులు

విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం ( ఎఫ్‌సీఆర్ఏ ) ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయించడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) 10 ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీవోలు )పై కేసు నమోదు చేసింది. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఒమిడియార్ సంస్థ కూడా నిందితుల జాబితాలో ఉంది. 
 
విదేశీ విరాళాలను ఎన్‌జీవోలు స్వీకరించాలంటే ఎఫ్‌సీఆర్ఏ ప్రకారం అనుమతి తప్పనిసరి.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఫారినర్స్ డివిజన్‌లో ఎఫ్‌సీఆర్ఏ ఓ భాగం. ఈ చట్టం ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్, రెన్యువల్, వార్షిక రిటర్నుల పరిశీలన వంటి కార్యకలాపాలు ఈ యూనిట్‌లో జరుగుతాయి. పారదర్శకత కోసం చాలా సేవలను ఆన్‌లైన్ ద్వారా అందజేస్తోంది.
ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సుల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్లు నమోదైన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లో ఒమిడియార్‌తోపాటు, గంగ ఆర్థోపెడిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ తరపున చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న వాగీశ్, ది సోషల్ ప్రాజెక్ట్ అనే ఎన్‌జీవోకు చెందిన రాబిన్ దేవదాస్, శ్రీజన్ ఫౌండేషన్ ప్రతినిధి స్వపన్ మన్నా, ఐరిస్ మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీకి చెందిన చినప్పన్ పిచ్చాయ్ పిళ్ళయ్ నిందితులుగా ఉన్నారు.
వీరితో  పాటు, సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు చెందిన రామస్వామి రంగనాథన్, క్రిస్టియన్ లైఫ్ సెంటర్ మినిస్ట్రీస్ అడ్మినిస్ట్రేటర్ ఆల్‌ఫ్రెడ్ మొహంతి, హార్వెస్ట్ ఇండియా ఎన్జీవో ప్రతినిధి కత్తెర సురేశ్ కుమార్, రిఫార్మ్‌డ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ నార్త్ ఈస్ట్ ఇండియా జనరల్ సెక్రటరీ లుంగవిరౌల్ ఖవ్బంగ్, నయా రోషిణి ఫౌండేషన్ ప్రెసిడెంట్ బిష్ణు మౌర్, ఒమిడియార్ ఎన్జీవో ప్రమోటర్స్, గువాహటిలోని ఎన్జీవో కూడా ఉన్నాయి.
సీబీఐ ఎఫ్ఐఆర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఒమిడియార్ సంస్థకు రూ.3 కోట్ల విదేశీ విరాళాలు వస్తున్నాయని, ఆ సొమ్మును స్వీకరించేందుకు అనుమతి కోసం దేవేశ్ చంద్ర ఏప్రిల్ 24న తుషార్ కాంతి రాయ్‌ని కలిశారు. ఈ విరాళాన్ని స్వీకరించేందుకు అనుమతి మంజూరు చేయిస్తానని, అయితే తనకు లంచంగా 10 శాతం చెల్లించాలని తుషార్ డిమాండ్ చేశారు.
అందుకు దేవేశ్ స్పందిస్తూ ఒమిడియార్ సంస్థవారు రూ.5 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, 10 శాతం అంటే కష్టమని తుషార్‌కు చెప్పారు. అందుకు తుషార్ బదులిస్తూ రూ.5 లక్షలంటే తాను తన సహోద్యోగులతో మాట్లాడలేనని, కనీసం 7 శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఇతరులకు కూడా ఇవ్వవలసి ఉంటుందని చెప్పారు.
 
ఓ సీబీఐ అధికారి మాట్లాడుతూ, దర్యాప్తు జరుగుతోందని, కొత్తగా మరికొన్ని ఎన్జీవోల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పారు. ముడుపులు తీసుకుని ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సులను మంజూరు చేసిన కేసులో బుధవారం 14 మందిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ప్రభుత్వోద్యోగులు కూడా ఉన్నారు. వీరి నుంచి రూ.3.21 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.