పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రస్థాయి గురుద్వారా వివాదంలో చిక్కారు. సిక్కుల పవిత్ర బైశాఖి రోజున సిఎం తాగి ఉన్న స్థితిలో స్థానిక డండమా సాహిబ్ గురుద్వారాలోనికి ప్రవేశించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిని రాష్ట్ర బిజెపి నేత తజీందర్ పాల్ సింగ్ దాఖలు చేశారు.
ఈ అంశంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని, తన ఫిర్యాదుకు తగు విధంగా స్పందించాలని ఆయన డిజిపికి విజ్ఞప్తి చేశారు. పంజాబ్ సిఎం మాన్కు వ్యతిరేకంగా తాను పోలీసులకు పంపించిన ఫిర్యాదు స్క్రీన్ షాట్ను ట్విట్టర్ ద్వారా మాన్ పొందుపర్చారు.
సిఎం అయి ఉండి, గురుద్వారాలోనికి తాగిన మైకపు స్థితిలో ప్రవేశించాడని, ఇది ఎంతటి దారుణం అని ప్రశ్నించారు. తాగిన స్థితిలో సిఎం గురుద్వారాలోనికి చేరుకున్నారని అంతకు ముందు స్థానిక శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జిపిసి) కూడా ఆరోపించింది.
ఇటీవలే పంజాబ్ సిఎంగా బాధ్యతలు చేపట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ఆప్ సిఎం ఇప్పుడు ఈ వివాదంలో చిక్కడం ఎటువంటి రాజకీయ దుమారాలకు దారితీస్తుందో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

More Stories
రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
కశ్మీర్లో 20సార్లు తప్పించుకున్న జైషే ఉగ్రవాది సహా ముగ్గురు హతం
భారతీయుల నైపుణ్యాలు బైటవారికే .. పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం