
ఓటు బ్యాంకు రాజకీయాలకు టక్కర్ ఇవ్వడంలో బీజేపీ విజయవంతం అయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చ్యువల్ గా ప్రసంగిస్తూ జన్ సంఘ్ నుంచి బీజేపీ ఆవిర్భావం, ఇప్పటి వరకు పోరాడిన, బలిదానాలు చేసిన కార్యకర్తల సేవల్ని గుర్తు చేసుకున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్య 100కు చేరిందని, ఈ తరుణంలో ఈ వేడుకలను జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా నేడు మనం జన సంఘ్ శకాన్ని గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఆ రోజుల్లో నూనె దీపాలను పట్టుకుని నడిచినవారిని, ఆ తర్వాత కమలంతో నడుస్తున్నవారిని గుర్తు చేసుకోవాలని సూచించారు. పార్టీని వైభవోపేతంగా తీర్చిదిద్దడం కోసం మూడు, నాలుగు తరాలవారు తమ జీవితాలను అంకితం చేశారని ప్రధాని కొనియాడారు. ఏ పార్టీ ప్రభుత్వమైనా దేశం కోసం ఏదీ చేయరనే భావన ప్రజల్లో ఉండేదబం గతంలో ఈ నైరాశ్యం ఉండేదని చెప్పారు. నేడు దేశం మారుతోందని, వేగంగా ముందుకు వెళ్తోందని ప్రతి పౌరుడు గర్వంగా చెబుతారని తెలిపారు.
పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, యువత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేయడమే తమ పార్టీ ఉద్దేశమని స్పష్టం చేశారు. అందుకే ఆయా వర్గాలు తమ పార్టీకి మద్దతుగా ఉంటున్నాయని ఆయన చెప్పారు.
‘నారీశక్తి భారత భవిష్యత్ కు దిశను ఇస్తుంది. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం చాలా కృషి చేస్తున్నాం. మన దృష్టిలో రాజనీతి, రాష్ట్రనీతి (రాజకీయం-.. జాతీయ విధానం) సమానంగా వెళ్తాలి. కానీ ఇప్పుడు దేశంలో రెండు రకాల రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకటి కుటుంబ రాజకీయాలు, ఇంకొకటి దేశభక్తి రాజకీయాలు’ అని చెప్పారు.
కుటుంబ పార్టీల్లో అన్ని వ్యవస్థల్లోనూ వారి వారసులదే అధికారం అని చెబుతూ ఇలాంటి పార్టీలతో దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని హెచ్చరించారు. దీని నుంచి దేశాన్ని బయటపడేసే పార్టీ బీజేపీనే అని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా గళమెత్తింది బీజేపీనే అని పేర్కొన్నారు.
అందుకే దేశ యువత, ప్రజలు కుటుంబ పార్టీలు ఎంత ప్రమాదమో అర్థం చేసుకుంటున్నారని ప్రధాని చెప్పారు. కుటుంబ పార్టీలు యువతను ఎదగనివ్వకుండా చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
‘వ్యాక్సినేషన్ కోసం కేంద్రం రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఏడున్నరేళ్ల పాలనలో పేదలకు పక్కా ఇళ్లతోపాటు బాత్రూమ్ లు కట్టించాం. ఆయుష్మాన్ భారత్, ఉజ్వల పథకంతోపాటు ఇంటింటికీ నీరు, ప్రతి పేదోడికి బ్యాంక్ అకౌంట్ లాంటివెన్నో చేశాం. అందరి విశ్వాసాన్ని చూరగొంటున్నాం. దేశాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాం’ అని ప్రధాని వివరించారు.
సమాజంలోని అట్టడుగు వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే మన లక్ష్యం అని చెబుతూ సామాజిక న్యాయం ధ్యేయంగా ముందుకెళ్తున్నామని మోదీ తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో జాగరూకత తీసుకురావాలని ఆయన కోరారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు టక్కర్ ఇవ్వడంలో బీజేపీ సఫలమైందని చెబుతూ అందుకే ప్రజల నుంచి పార్టీకి ఆదరణ దక్కుతోందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగించే ప్రభుత్వాలపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
దేశ సేవ కోసం అనునిత్యం కృషి చేయాలంటూ కార్యకర్తలు, నేతలకు సూచించారు. తాను కూడా ఓ కార్యకర్తలా పార్టీ ఇచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని తెలిపారు. దేశాన్ని మరింత ఎత్తులకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉందని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత దేశ వైఖరిని ప్రస్తావిస్తూ, నేడు భారత దేశం ప్రపంచం ముందు దృఢంగా నిలిచిందని చెప్పారు. ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా తన ప్రయోజనాల కోసం భారత దేశం దృఢ వైఖరిని ప్రదర్శిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో కొందరు విదేశీ నేతలు న్యూఢిల్లీలో పర్యటించి, భారత దేశం జోక్యాన్ని కోరిన సంగతి తెలిసిందే.
యావత్తు ప్రపంచం రెండు శత్రు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రపంచం దృష్టిలో భారత దేశం మానవత్వం గురించి దృఢంగా మాట్లాడగలిగే దేశంగా ఉందని మోదీ చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు