అసోం, మేఘాలయ సరిహద్దు వివాదానికి తెర

అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 1972 నుంచి నెలకొన్న 884 కిలోమీటర్ల సరిహద్దు వివాదంలో ప్రధాన సమస్యలకి పరిష్కారం దొరికినట్లైంది.
 
అసోం సీఎం హిమంత విశ్వశర్మ, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోం మంత్రి సమక్షంలో ఈ చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు సమస్యకు స్వస్తి పలకడానికి ఓ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించారు. 
 
ఈ సరిహద్దు వివాదంలో మొత్తం 12 అంశాలపై గొడవలుండగా, 6 అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకారానికి వచ్చారని, సంతకాలు కూడా చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వివరించారు. దాదాపు 70 శాతం సమస్య పరిష్కారమైందని, ఇక మిగతా 6 అంశాలపై కూడా త్వరలోనే ఓ అంగీకారం కుదురుతుందని ప్రకటించారు.
 
 ప్రస్తుతం మొదటి దశ తీర్మానాలు జరిగాయని, మిగిలిన వివాదాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని అసోం సీఎం హిమంత విశ్వశర్మ, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా తెలిపారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో తగిన సూచనలిచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌షాకు వారు ధన్యవాదాలు తెలిపారు.
యాభై ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. దీంతో ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. తమకున్న అభ్యంతరాలు, పరిష్కారాలతో కూడిన డ్రాఫ్ట్‌ను హోం వ్యవహారాల శాఖకు అందజేశాయి. వీటిని పరిశీలించిన కేంద్రం ఇద్దరు సీఎంలతో చర్చించి, తగిన పరిష్కారాలు సూచించింది. దీంతో అసోం-మేఘాలయ సీఎంలు ఇద్దరూ తాజా ఒప్పందంపై సంతకాలు చేశారు