వేదాద్రి మహాకుంభ సంప్రోక్షణ పూర్తి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తి అయ్యింది. ఎంతో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం జరిగింది. దానితో  ఆరేళ్ళ తర్వాత గర్భగుడి నుంచి భక్తులకు స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తున్నారు. 
 
నమో: నారసింహ నినాదాలతో యాదాద్రి ప్రధానాలయం మారుమ్రోగుతున్నది. స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మహా కుంభ సంప్రోక్షణ అనంతరం స్వామి వారిని మొదటగా సీఎం కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు దర్శనం చేసుకున్నారు. 
దివ్య విమానంపై సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ జరిగింది. శ్రీ సుదర్శన స్వర్ణచక్రానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  సమక్షంలో యాగజలాలతో రుత్వికులు సంప్రోక్షణ చేశారు. ఆపై ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు.
రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. సంప్రోక్షణ అనంతరం ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది.  సరిగ్గా 12.20 గంటలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది. 
సీఎం కేసీఆర్‌ దంపతులు తొలిపూజ చేయగా, మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామి వారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.  యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వాలు వైభవంగా కొనసాగాయి.  గత వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి సోమవారంతో పూర్తయింది.
అనంతరం బంగారు కవచ మూర్తులతో బాలాలయం నుంచి ప్రధానాలయం చుట్టూ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. శోభాయాత్ర పూర్తయిన తర్వాత మహాకుంభ సంప్రోక్షణ చేపట్టారు.
విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. మిథునలగ్నంలో ఏకాదశి నాడు ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం కాగా,  12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన జరిగింది. సరిగ్గా 12.20 గంటలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలైంది.  
అంతకుముందు బాలాలయంలోని స్వామివారు, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సిఎం దంపతుల తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు.