భారత్ సామర్థ్యం సూచిస్తున్న $400 బిలియన్ ఎగుమతులు

 
400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినందుకు భారత్‌ను అభినందించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ  ఈ నెల ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘భారతదేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించింది. ఇది భారతదేశ సామర్థ్యాలు మరియు సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో భారతీయ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం’అని ప్రధాని తన నెలవారీ రేడియో కార్యక్రమంలో తెలిపారు.
 ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తుల కోసం గళమెత్తితే, మన దేశ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టబోదని ప్రధాని చెప్పారు. ప్రతి భారతీయుడు ‘వోకల్ ఫర్ లోకల్’ అయితే ‘లోకల్ నుంచి గ్లోబల్’గా మారడానికి ఎంతో సమయం పట్టదని స్పష్టం చేశారు.
రైతులు, కళాకారులు, చేనేతకారులు, ఇంజినీర్లు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఇకీ, వివిధ రంగాల్లోని నిపుణులు మన దేశానికి బలమని ప్రధాని చెప్పారు. వీరందరి కఠోర శ్రమ కారణంగానే 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరిందని తెలిపారు. భారతీయుల ఈ శక్తి, సామర్థ్యాలు ఇప్పుడు ప్రపంచంలోని అన్ని మూలల్లోని నూతన మార్కెట్లకు చేరుకుంటోందని తెలిపారు. మన ఉత్పత్తుల కీర్తిని మరింత పెంచుదామని, లోకల్‌ను గ్లోబల్‌గా వృద్ధి చేద్దామని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఈ- మార్కెట్‌ప్లేస్ పోర్టల్ (GeM) పోర్టల్ ద్వారా ప్రభుత్వం వస్తువులను కొనుగోలు చేసిందని, దాదాపు 1.5 లక్షల మంది చిన్న వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తిని నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారని ప్రధాని హైలైట్ చేశారు.  ‘ఇంతకుముందు, పెద్ద వ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి ఉత్పత్తులను విక్రయించగలరని విశ్వసించేవారు, కానీ ప్రభుత్వ ఈ-మార్కెట్ పోర్టల్ ఈ వైఖరిని మార్చింది; ఇది  నూతన భారతదేశ స్ఫూర్తిని చూపుతుంది’ అని చెప్పారు.
నేడు ప్రపంచం ఏ విధంగా యోగా, ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతోందో మనం చూస్తున్నామని ప్రధాని  మోదీ చెప్పారు.  ఈ నెలలో కతార్‌లో యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 114 దేశాలవారు పాల్గొన్నారు.  ఇండియన్ ఎంబసీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారతీయులకు, కతార్‌కు గర్వకారణమైన చారిత్రక క్షణాలు నమోదయ్యాయని తెలిపింది.
ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో 114 దేశాలవారికి యోగా పాఠం చెప్పినట్లు, ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్లు తెలిపింది.  మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, మంచి ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రపంచాన్ని యోగా సమైక్యపరుస్తోందని తెలిపారు. యోగాభ్యాసం చేయడం కోసం అనేక దేశాల ప్రజలను ఒక చోటుకు చేర్చడంలో దోహాలోని ఇండియన్ ఎంబసీ గొప్ప కృషి చేసిందని ప్రశంసించారు.
మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం మాట్లాడుతూ, ‘‘యోగా, ఆయుర్వేదం పట్ల ప్రపంచం ఏ విధంగా మొగ్గు చూపుతోందో నేడు మనం చూస్తున్నాం. గత వారం ఓ యోగా కార్యక్రమంలో 114 దేశాలవారు పాల్గొనడంతో సరికొత్త రికార్డు నెలకొన్న విషయాన్ని మీరు చూశారు’’ అని చెప్పారు. మన దేశంలో ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతుందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా రేడియో కార్యక్రమం ప్రసారం చేశారు.  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ఇతర బిజెపి కార్యకర్తలతో కలిసి న్యూ ఢిల్లీలోని యమునా విహార్ మండల్ బూత్ నంబర్ 59 వద్ద ప్రదర్శనను వినడానికి హాజరయ్యారు.
శుక్రవారం, ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి గత నెల ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లోని ఆసక్తికరమైన అంశాలను ప్రదర్శించే సంక్షిప్త బుక్‌లెట్‌ను పంచుకున్నారు. ‘గత నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లోని ఆసక్తికర అంశాలను ప్రదర్శించే క్లుప్తమైన బుక్‌లెట్ ఇక్కడ ఉంది. ఇందులో పాల్గొన్న వారిలో కొందరితో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మీరు పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.