ఉత్సాహంగా ‘వింగ్స్‌ ఇండియా 2022’ ప్రదర్శన

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ‘వింగ్స్‌ ఇండియా 2022’ ప్రదర్శన గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. తొలి రోజు పలు విమానాలు, ఎయిర్‌క్రాప్ట్‌లు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ నెల 24 నుంచి 27 వరకూ జరిగే ఈ ప్రదర్శనలో తొలి రెండు రోజులు వ్యాపార వర్గాలకు ప్రవేశం కల్పిస్తున్నారు. 
 
125పైగా జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు పాల్గంటున్నారు. 15 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. తొలి రోజు హెలిక్యాప్టర్‌ పరిశ్రమ, డోన్‌ రంగాలపై ప్యానెల్‌ చర్చలు జరిగాయి. హెలిక్యాప్టర్ల వినియోగం, సవాళ్లపై నిపుణులు ఇందులో చర్చించారు. 2030 నాటికి భారత డ్రోన్‌లు గ్లోబల్‌ హబ్‌లో కీలకంగా మారనున్నాయని అంచన వేశారు.
 
అసియాలోనే అతిపెద్ద వాణిజ్య, సాధారణ, పౌర విమానయాన ఈ ప్రదర్శనకు శుక్రవారం కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సిందియా, ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్‌ రావు, సివిల్‌ ఏవియేషన్‌ శాఖ సెక్రటరీ రాజీవ్‌ బన్సల్‌ హాజరు కానున్నారు. దేశ విమానయాన రంగంలో ఉన్న విస్తృతావకాశాలపై ఏర్పాటు చేసే సమావేశంలో మాట్లాడనున్నారు. 
 
చివరి రెండు రోజులు 26, 27న సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఇస్తారు. పౌర విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ విమానయాన రంగంలో పెట్టుబడులు, ప్రాంతీయ కనెక్టివిటీ, విమానయాన, హెలికాప్టర్లు, డ్రోన్‌ల వినియోగం, విమానయాన పరిశ్రమ దశ, దిశ మొదలైన వాటిపై సదస్సులు, చర్చలు జరగనున్నాయి.
 
బెంగళూరులో ప్రపంచ స్థాయికి చెందిన అంతర్జాతీయ సప్లై చెయిన్‌ సపోర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విమానాలు, హెలికాప్టర్‌ ఇంజన్ల్‌ను రూపొందించే ప్రాట్‌ అండ్‌ విట్నీ వెల్లడించింది. 
 
భారత డిజిటల్‌ సామర్థ్యాలపై దృష్టి కేంద్రీకరించిన తమ సంస్థ అంతర్జాతీయ సప్లయి చెయిన్‌ను మెరుగుపరచడానికి కాపబిలిటి సెంటర్‌ (ఐసిసి) వందలాది అనలిస్ట్స్‌, డేటా సైంటిస్ట్స్‌ను నియమించుకోనున్నట్లు ప్రాట్‌ అండ్‌ విట్నీ కెనడా వైస్‌ ప్రెసిడెంట్‌ జిమ్‌ హమకియోటిస్‌ తెలిపారు.