ప్రభుత్వ సిబ్బంది ఆఫీసు టైమ్లో మొబైల్స్ ఉపయోగించరాదని తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కోర్టు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రమణియమ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేకాక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
తిరుచిరాపల్లిలో హెల్త్ రీజనల్ వర్క్షాప్ విభాగంలో పనిచేసే సూపరింటెండెంట్ ఇటీవల ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దాంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో మొబైల్స్ వినియోగించడంపై అసహనం వ్యక్తం చేసింది.
‘ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు కనీస క్రమశిక్షణ పాటించాలి. మొబైల్ ఫోన్లను వీలైతే స్విచాఫ్ చేయాలి లేదా వైబ్రేషన్/సైలెంట్ మోడ్లో పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ మాట్లాడాల్సి వస్తే పై అధికారుల అనుమతి తీసుకుని కార్యాలయం బయటకు వెళ్లి మాట్లాడి రావాలి’ అని హైకోర్టు స్పష్టం చేసింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్కూలర్ జారీ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

More Stories
ఢిల్లీలో కురవనున్న తొలి కృత్రిమ వర్షం
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు