సమతామూర్తి బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని ప్రధాని స్పష్టం చేశారు. రామానుజాచార్యులు అంధవిశ్వాసాలను పారదోలారని, అలాగే ఆయన భక్తికి కులం, జాతి లేదని చాటిచెప్పారని మోదీ గుర్తుచేశారు. మనిషికి జాతి కాదు గుణం ముఖ్యమని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని తెలిపారు.
ప్రగతి శీలత, ప్రాచీనతలో భేదం లేదని రామానుజాచార్యను చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. వెయ్యేళ్ల కిందట మూఢ విశ్వాసాలు ఎంతగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమేనని పేర్కొంటూవాటిని తొలగించేందుకు రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారని మోదీ గుర్తుచేశారు. ఆనాడే రామానుజాచార్యులు దళితులను కలుపుకుని ముందుకు సాగారని, ఆలయాల్లో దళితులకు దర్శన భాగ్యం కల్పించారని వివరించారు.
అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్ అని ఆయన అభివర్ణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రామానుజాచార్యుల ప్రవచనాలనే చెప్పారని ప్రధాని గుర్తు చేశారు.స్వాతంత్య్ర పోరాటంలో ఐక్యత, సమానతదీ కీలకపాత్ర అని ప్రధాని వెల్లడించారు. హైదరాబాద్ ఏర్పాటులో సర్దార్ పటేల్ కీలకపాత్ర పోషించారని, ఆయన చాణక్యం వల్లే హైదరాబాద్కు విముక్తి లభించిందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు.
శ్రీరామనగరం చేరుకున్న ప్రధాని తొలత యాగశాలకు వెళ్లారు. యాగశాలలో విశ్వక్సేనేస్టి పూజలో చిన్న జీయర్ స్వామి ప్రధానికి కంకణధారణ చేయించడంతో పాటు మెడలో పూలమాల వేసి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ప్రధాని శ్రీరామచంద్ర పెరుమాళ్ను దర్శించుకుని సమతామూర్తి ప్రాంగణంలో డిజిటల్ గైడ్ ద్వారా 108 దివ్యదేశ నమూన ఆలయ విశేషాలను తెలుసుకున్నారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆలయాల విశిష్టతలను, సమతామూర్తి ప్రాంగణం విశిష్టతలను ప్రధాని మోదీకి వివరించారు. ఆ తర్వాత రామానుజాచార్యుల విగ్రహానికి ప్రధాని పూజలు చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించి 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణ చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామానుజ చిన్నజీయర్ స్వామి శ్రీరామానుజాచార్యుల ప్రతిమను బహూకరించారు.
ఈక్రమంలో లేజర్ షోను ఆవిష్కరించిన ప్రధాని యాగశాలకు చేరుకుని హోమం గుండం దగ్గర ధ్యానం చేశారు. 5వేల మంది రుత్వికులు ప్రధానికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ప్రధాని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకుని దివ్యదేశాల విశిష్టతలను తెలుసుకున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కిలోల సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆయన సందర్శించారు.
ఆ తర్వాత భద్రవేదికపై సమతామూర్తి విగ్రహానికి పూజలు చేశారు. తిరునామం, పట్టు వస్త్రాల్లో వచ్చిన మోదీ వేద పండితుల్ని అనుకరించారు. ప్రధానిమోదీతో రుత్వికులు సంకల్పం చేయించారు. అనంతరం రామానుజ జీవిత చరిత్ర విశేషాల గ్యాలరీని సందర్శించారు.
More Stories
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
పట్టభద్రుల ఎంఎల్సికి నోటిఫికేషన్