విదేశీ విరాలపై ఎన్‌జీఓలకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

విదేశీ విరాళాలు పొందేందుకు అవసరమైన  ఎఫ్‌సీఆర్‌ఏ   అనుమతులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన సుమారు  6000కు పైగా ప్రభుతేతర సంస్థలు లేదా ఎన్‌జీఓలకు చుక్కెదురైనది. 
 
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు సుప్రీంకోర్టులో ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి చెల్లుబాటులో ఉన్న అన్ని సంస్థల ఎఫ్‌సిఆర్‌ఎలను తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కొనసాగించాలంటూ దాఖలయిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది.
 
పిటిషనర్లు సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని చట్టానికి అనుగుణంగా అధికారులు వారి అభ్యర్థనలను పరిశీలించవచ్చని న్యాయమూర్తులు దినేశ్ మహేశ్వరి, సిటి రవికుమార్‌లు కూడా ఉన్న బెంచ్ స్పష్టం చేసింది. 
అమెరికాకు చెందిన ఎన్‌జీఓ గ్లోబల్‌ పీస్‌ ఇనిషియేటివ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. దేశంలో మూడో వేవ్‌ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడుతున్నందున లైసెన్స్‌ల రద్దు కరోనా సహాయ చర్యలపై బలహీనపర్చే ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఈ ఎన్‌జీఓలు ఇప్పటి వరకు మిలియన్‌ల మంది భారతీయులకు సాయం చేశాయని గుర్తు చేసింది. ఇది అవసరమైన పౌరులకు సహాయ నిరాకరణకు దారితీస్తుందని పేర్కొంది.
గడువులోగా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న 11,594 ఎన్‌జీఓలకు ఇప్పటికే గడువు పొడిగించామని జస్టిస్‌ ఏంఎ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరీ, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.
ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ అభ్యర్థన వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నించారు. లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న  11,594 స్వచ్ఛంద సంస్థలు( ఎన్‌జిఓల)   ఇప్పటికే పొడగింపులు అందుకున్నాయని పేర్కొన్నారు. పిటిషనర్‌ అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన ఓ వ్యక్తి అంటూ స్పష్టం చేశారు.
తాజా పిటిషన్‌తో ఎలాంటి ప్రయోజనం పొందాలనుకుంటున్నారో తెలియడం లేదని మెహతా చెప్పుకొచ్చారు. కానీ ఏదో తప్పు ఉందని తెలిపారు. అయితే తదుపరి విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మెహతా వాదనలను బెంచ్ ప్రస్తావిస్తూ అధికారులు తీసుకున్న వైఖరి దృష్టా ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. 
 
ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలయిన పలు పిటిషన్లపై తీర్పు ప్రకటించిన తర్వాత ఈ పిటిషన్‌ను విచారిస్తామని బెంచ్ తెలిపింది. మరో ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్‌) యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణల కేసులో తీర్పు వెలువడిన తరువాత అది జరుగుతుందని కోర్టు తెలిపింది.