
మహిళల వివాహ అర్హత వయసును 18 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006ను ప్రభుత్వం సవరిస్తుంది. అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, 1955 వంటి వ్యక్తిగత చట్టాలకు కూడా సవరణలు చేస్తుంది.
బిడ్డలను కనేందుకు సముచితమైన వయసు, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, పోషకాహార స్థాయుల మెరుగుదల, సంబంధిత ఇతర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జయ జైట్లీ నేతృత్వంలో ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది.
ఈ టాస్క్ఫోర్స్ 2020 డిసెంబరులో నీతీ ఆయోగ్కు సమర్పించిన సిఫారసుల ఆధారంగా మహిళల వివాహ వయసును 18 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళకు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ సిఫారసులను చేశామని చెప్పారు. నిపుణులు, యువత, మరీ ముఖ్యంగా యువతులను సంప్రదించి ఈ నివేదికను సమర్పించామని పేర్కొన్నారు.
జనాభా నియంత్రణ కోసం తాము ఈ సిఫారసులు చేయడం లేదనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని, జనాభా నియంత్రణలోనే ఉందని ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించిందని ఆమె గుర్తు చేశారు. మహిళలను సాధికారులను చేయడమే తమ సిఫారసుల ఉద్దేశమని ఆమె తెలిపారు.
2020 ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మహిళల వివాహ అర్హత వయసును పెంచుతామని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పురుషుల వివాహ అర్హత వయసు 21 సంవత్సరాలు.
More Stories
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు