
దేశంలోని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు కేవలం 15 రోజుల్లోనే రూ. 3.3 లక్షల కోట్లు పెరిగాయి. ఈ ఏడాది నవంబర్ 5 తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల్లోని డిపాజిట్లు భారీగా ఎగిశాయని, గత 24 ఏళ్లలో ఇంతలా డిపాజిట్లు పెరగడం ఇది ఐదోసారి మాత్రమేనని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకటించింది.
దీపావళి సమయంలో ఈ విధంగా భారీగా డిపాజిట్లు ఎప్పుడూ పెరగలేదని పేర్కొంది. కానీ, తర్వాత 15 రోజుల్లో (నవంబర్ 19 వరకు) బ్యాంకుల్లోని డిపాజిట్లు రూ. 2.7 లక్షల కోట్లు తగ్గాయని కూడా తెలిపింది. ఐపీఓ బూమ్ కొనసాగుతుండడం వలనే విత్డ్రాయల్స్ కూడా పెరిగాయని అంచనావేసింది.
తక్కువ సమయంలోనే ఇంతలా డిపాజిట్లు పెరగడం 1997 తర్వాత ఇది ఐదో సారి. అంతే వేగంగా కూడా తగ్గడం 1997 తర్వాత మొదటి సారి. నోట్ల రద్దు తర్వాత అంటే 2016 , నవంబర్ 25 తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల డిపాజిట్లు రూ. 4.16 లక్షల కోట్లు ఎగిశాయి. అదే ఏడాది సెప్టెంబర్ 26 తో ముగిసిన 15 రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి.
2019 మార్చి 29 తో ముగిసిన 15 రోజుల్లో రూ. 3.46 లక్షల కోట్లు, 2016, ఏప్రిల్ 1 తో ముగిసిన 15 రోజుల్లో రూ. 3.41 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి.
ఒక్కసారిగా ఇలా డిపాజిట్లు పెరగడం, అంతే వేగంగా తగ్గడం ప్రజల చెల్లింపుల అలవాట్లలో మార్పులొచ్చాయనే విషయాన్ని తెలుపుతున్నాయని ఎస్బీఐ రిపోర్ట్ అంచనావేసింది.
రివర్స్ రెపో రేట్లలో (ఆర్బీఐ దగ్గర) డిపాజిట్లు కూడా ఈ ఏడాది అక్టోబర్ 19 నాటికి రూ. 0.45 లక్షల కోట్లుగా ఉండగా, నవంబర్ 19 నాటికి రూ. 2.4 లక్షల కోట్లకు పెరిగాయని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది.
More Stories
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం
5జీ కోసం జియో లక్ష టవర్లు