తెలంగాణ భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా సేకరించిన రాష్ట్రంలోని భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లినట్లయ్యిందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దాదాపు 70 లక్షల మంది రైతులకు చెందిన సుమారు కోటిన్నర ఎకరాల భూముల రికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల సమాచారం ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీకి చేతిలో పడి ఆ భూముల డేటా భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ డేటాపై సైబర్ దాడులు జరిగి హ్యాక్ అయితే పరిస్థితి ఏమిటి? అని ఆమె ప్రశ్నించారు.  ఏవైనా సమస్యలు తలెత్తితే, అప్పుడు ఏకైక ఆధారమైన మాన్యువల్ రికార్డులను పరిరక్షించే చర్యల్ని కూడా సర్కారు చేపట్టడం లేదని ఆమె ధ్వజమెత్తారు. 
 
తెలంగాణలో ప్రజల ఆస్తులైన సర్కారు భూములు, రైతుల భూముల డేటా భద్రత విషయంలో ఇంత దారుణమైన నిర్లక్ష్యాన్ని తెలంగాణ సర్కారు ప్రదర్శిస్తోందని విజయశాంతి మండిపడ్డారు. 
తెలంగాణ రైతుల భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ మొత్తాన్నీ దివాళా బాటపట్టిన టెర్రాసిస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ చేతుల్లో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిందని ఆమె పేర్కొన్నారు.
ఈ టెర్రాసిస్ గతంలో బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్న ఐఎల్ఎఫ్ఎస్ చేతుల్లో ఉండేదని ఆమె తెలిపారు. ఇప్పుడు టెర్రాసిస్‌లో సగానికి పైగా వాటాను ఫిలిప్పీన్స్‌‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్‌‌నకు  ఐఎల్ఎఫ్ఎస్ అమ్మేసిందని విజయశాంతి వివరించారు.
 
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంటూ తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోని లోపాలతో రాష్ట్రంలోని ప్రజలు… ముఖ్యంగా రైతులు ఇప్పటికే గుండెలు బాదుకుంటున్నారని ఆమె తెలిపారు. పైగా ఇందుకు సంబంధించిన సమాచారం అడిగిన సమాచార కార్యకర్తలకు కూడా  సరైన జవాబు ఇచ్చే దిక్కు లేదని ఆమె ఆరోపించారు. 
 
భూముల ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న ఈ  ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని  విజయశాంతి స్పష్టం చేశారు.