ఏపీలో రాష్ట్రపతి పాలన.. రాష్ట్రపతిని కోరిన చంద్రబాబు

ఏపీలో రాష్ట్రపతి పాలన.. రాష్ట్రపతిని కోరిన చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి రాజ్యాంగంలో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే నిబంధనను వ్యతిరేకిస్తూ వస్తున్నది. అయితే మొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టికల్ 356 ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. 
 
చంద్రబాబు నాయకత్వంలో టిడిపి  బృందం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని, నాలుగు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిశామని పేర్కొన్నారు. 
 
ఏపీలో ఆర్టికల్ 356ను అమలు చేయాలని, దాడుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీలో గంజాయి, హెరాయిన్లపై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని, చేసిన తప్పులకు శిక్షపడాలని కోరినట్లు చెప్పారు. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేశామని తెలిపారు. 

రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు చేశారని, డీజీపీ, పోలీసులకు ఫోన్లు చేస్తే స్పందించరని మండిపడ్డారు. ఘటనాస్థలికి తాను వెళ్లేసరికి దాడి చేసినవారిని పోలీసులే పంపిస్తున్నారని పేర్కొంటూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనని ఆయన స్పష్టం చేశారు. 

దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఏపీలో మూలాలున్నాయని చంద్రబాబు  ఆరోపించారు. ఏపీలో 23వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని చెప్పారు.  రాష్ట్రంలో రాజకీయ నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సహజవనరులను ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నికల కమిషనర్‌పై దాడులు చేసి ఇంటికి పంపించే వరకు ఊరుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తమపై దాడులు చేసి.. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రెండేళ్లుగా జగన్‌రెడ్డి చేస్తున్న పరిపాలనపై బుక్ రూపొందించిన టీడీపీ.. ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఒక జాతీయ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారని చెప్పారు. రాజమండ్రి శిరోముండనం కేసును కూడా ప్రస్తావించారు. మీరు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అమరావతి రాజధాని ఏమైందని అడిగారు. దానికి చంద్రబాబు బదులిస్తూ వైఎస్‌ జగన్‌ను అమరావతిని ధ్వంసం చేశారని చెప్పారు.