టెక్స్‌టైల్ రంగంలో రూ10,683 కోట్లు ప్రోత్స‌హకాలు

టెక్స్‌టైల్ రంగంలో రూ10,683 కోట్లు ప్రోత్స‌హకాలు

కేంద్ర క్యాబినెట్ ఇవాళ టెక్స్‌టైల్ రంగంలో ఉత్ప‌త్తి సంబంధిత ప్రోత్సాహ‌క స్కీమ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద అయిదేళ్ల పాటు టెక్స్‌టైల్స్ రంగానికి 10,683 కోట్లు ప్రోత్స‌హకాల రూపంలో ఇవ్వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో జ‌రిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌, అనురాగ్ ఠాకూర్‌లు ఈ విష‌యాన్ని ఇవాళ మీడియాకు వెల్ల‌డించారు. పీఎల్ఐ స్కీమ్ ద్వారా అద‌నంగా 7.5 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను క్రియేట్ చేయ‌నున్నారు. పీఎల్ఐ స్కీమ్‌తో గుజ‌రాత్‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, పంజాబ్‌, ఏపీ, తెలంగాణ‌, ఒడిశా లాంటి రాష్ట్రాల‌కు పాజిటివ్ ప్ర‌భావం ఉంటుంద‌ని కేంద్ర టెక్స్‌టైల్ శాఖ‌ మంత్రి గోయ‌ల్ తెలిపారు. 

ఈ స్కీమ్‌ను ఇత‌ర రాష్ట్రాలు కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.  పీఎల్ఐ విధానంతో మ‌హిళ‌ల‌కు అధిక సంఖ్య‌లో ప్రాతినిధ్యం ల‌భిస్తుంద‌ని చెప్పారు. ఈ స్కీమ్‌తో భార‌తీయ కంపెనీలు గ్లోబ‌ల్ సంస్థ‌లుగా ఎదుగుతాయ‌న్నారు. టైర్‌3, టైర్4 ప‌ట్ట‌ణాలు, జిల్లాల‌కు ప్రాధాన్య‌త ఆధారంగా నిధుల‌ను కేటాయించ‌నున్న‌ట్లు మంత్రి గోయ‌ల్ చెప్పారు.