నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో బిజెపి, పంజాబ్ లో ఆప్

నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో బిజెపి, పంజాబ్ లో ఆప్
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ తో సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాలలో తిరిగి బీజేపీ గెలుపొందుతుందని, పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ వెనుకబడి, ఆప్ అతిపెద్ద పార్టీగా వస్తుందని ఏబీపీ సీఓటర్‌ సర్వే వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్,  ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో బీజేపీ తిరిగి అధికారం కైవసం చేసుకోన్నుట్లు తెలిపింది. 

పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ఆప్‌ అవతరించనున్నట్లు ఏబీపీ సీఓటర్‌ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ 38-46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఆప్‌ 51-57 సీట్లు గెలుస్తుందని ఏబీపీ-సీఓటర్‌ తెలిపింది.  దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తప్పదనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

యూపీలో బీజేపీకి కాస్త ప్రాబల్యం తగ్గినా తిరిగి అధికారం దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. బీజేపీ సుమారు 60 సీట్లను యూపీలో కోల్పోయినా  అధికారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొంది. ఇక్కడ బీజేపీ 259 నుంచి 267 నుంచి గెలుస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో ఎస్పీ 109 నుంచి 117 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. 

ఇక బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని తెలిపిన సర్వే, కాంగ్రెస్‌ 3 నుంచి 7 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే నిర‍్వహించిన సర్వేలో 44 శాతం మంది ముఖ్యమంత్రి  యోగి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది.

గోవాలో కూడా బీజేపీకే తిరిగి అధికారం కట్టబెట్టనున్నట్లు సర్వే తెలిపింది.  బీజేపీ 39. 4 ఓట్ల శాతంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని. అదే సమయంలో ఆప్‌ 22.2 ఓట్ల శాతాన్ని సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్‌ 15.4 శాతానికి పరిమితం కానుందని తెలిపింది. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు వస్తాయని వెల్లడించిన సర్వే,ఆప్‌కు 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్‌ 3 నుంచి 7 సీట్లకు పరిమితం కానుందని వెల్లడించింది.

మణిపూర్‌లో సైతం బీజేపీనే ఆధిక్యంలో నిలిచి అధికారం దక్కించుకుంటుందని తెలిపింది. ఇక్కడ బీజేపీ 40.5 ఓట్ల శాతంతో అధికారాన్ని తిరిగి  నిలబెట్టుకుంటుందని తెలిపిన సర్వే, కాంగ్రెస్‌ 34.5 శాతంలో రెండో స్థానానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్‌ 18 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది.

70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి  46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ 21 సీట్లు గెలుస్తుంది ఏబీపీ-సీఓటర్‌ తన సర్వే  పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లలో బీజేపీ 11 కోల్పోయే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది.