గోళ్లకు రంగు వేసుకుని మహిళ కనిపిస్తే వేళ్లు తెగ్గోస్తాం 

గోళ్లకు రంగు వేసుకుని మహిళ కనిపిస్తే వేళ్లు తెగ్గోస్తాం 

షరియా చట్టాల ప్రకారం మహిళలకు హక్కులుంటాయని ప్రకటించిన తాలిబన్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. గోళ్లకు రంగు (నెయిల్ పాలిష్) వేసుకుని కనుక మహిళ కనిపిస్తే వేళ్లు తెగ్గోస్తామని హెచ్చరిస్తున్నారు. వీధులలో మహిళలు కనిపిస్తే అరాచకాలకు పాల్పడుతున్నారు.

కాబూల్ వీధుల్లో స్నేహితులతో కలిసి వెళ్తున్న తమను జిహాదీల గ్రూపు వెంబడించిందని, తమను చుట్టుముట్టి ఇస్లామును అగౌరవపరిచినట్టు ఆరోపించారని ఓ టీనేజీ గ్రూపు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ గ్రూపు ఫేస్‌బుక్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. 

తమ గ్రూపులో ఇద్దరు జిహాదీల నుంచి తప్పించుకోగా మిగిలిన వారిని చావబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడలు నొక్కి పెట్టి తుపాకి గురిపెట్టి బెదిరించారని వారు ఆరోపించారు. 

టీ షర్టులు, జీన్స్ ధరించిన తాలిబన్లు తమను టార్గెట్ చేశారని మరికొందరు ఆరోపించారు. ఆఫ్ఘన్ దుస్తులు ధరించలేదని తమ జర్నలిస్టును తాలిబన్లు చావగొట్టారని ఆఫ్ఘాన్ న్యూస్ పేపర్ ఎటిలాట్‌రాజ్ రెండు రోజుల క్రితం పేర్కొంది. పురుషులకు తాము డ్రెస్‌కోడ్ డిసైడ్ చేస్తామని తాలిబన్లు చెప్పినట్టు దినపత్రిక తెలిపింది. 

ఇటీవల జరిగిన దారుణాలు 

* టఖర్ ప్రావిన్స్‌ రాజధాని టలోకన్‌లో బురఖా ధరించనందుకు ఓ మహిళను కాల్చి చంపారు

* కాబూల్ వీధుల్లో తిరుగుతున్న సాయుధ తాలిబన్లు.. హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులుపై కాల్పులు జరుపుతున్న వీడియో ఒకదానిని ‘ఫాక్స్ న్యూస్’ ప్రసారం చేసింది. 

* కాబూల్ ఎయిర్‌పోర్టులో కొనసాగుతున్న గందరగోళం నేపథ్యంలో కాల్పులు జరపడానికి ముందు మహిళలు, చిన్నారులపై తాలిబన్లు కొరడాలు ఝళిపించారు. 

* ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం నలుగురు మహిళలు మరణించారు. 

* తాలిబన్ల రాకను చూసి వణికిపోయిన మహిళలు.. ‘తాలిబన్లు వస్తున్నారు’ అని భయపడుతూ అరవడం ఓ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

* వంట సరిగా చేయలేదని ఓ మహిళకు నిప్పు పెట్టి చంపేశారు. 

* 12 ఏళ్లు నిండిన బాలికలను బలవంతంగా తాలిబన్లు వివాహం చేసుకుంటున్నారు. 

* బిగుతు దుస్తులు ధరించినందుకు ఓ మహిళను కాల్చి చంపారు.