సీమ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేయలే

సీమ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేయలే

కృష్ణ జలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం  కేసీఆర్ చేయలేదని పేర్కొంటూ కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయారని ధ్వజమెత్తారు. 

66 శాతం కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉండగా 535 టిఎంసిలు రావాల్సి ఉందని ఆమె చెప్పారు. అయితే కేవలం 299 టిఎంసిల వాటాను మాత్రమే తీసుకోవడానికి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. పంతాలు, పట్టింపులకు వెళ్లి జూరాల దగ్గర ప్రాజెక్టు ని మార్చారని ఆమె ఆరోపించారు. 

జగన్ తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని అరుణ స్పష్టం చేశారు. 203 జీవో విడుదల చేసి రూ 6 వేల కోట్లతో ఉత్సాహంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆమె చెప్పారు. లోపాయకారి ఒప్పందంతోనే రాయల సీమ ప్రాజెక్టు నడుస్తోందని ఆమె తెలిపారు. అటు, ఇటు ఒకే కాంట్రాక్టర్ ఉన్నప్పటికీ ఎందుకు ప్రాజెక్టు పనులు ఆపలేదని ఆమె ప్రశ్నించారు. 

కెఆర్ఎంబి టేలిమెట్రిస్ ఏర్పాటు చేయాలని సూచించినా ఇప్పటికి ఏర్పాటు చేయలేదని ఆమె గుర్తు చేశారు. ఏ ఒప్పందం తో కృష్ణ జలాలను తాకట్టు పెట్టారని కేసీఆర్ ని ఆమె ప్రశ్నించారు. కుర్చీ వేసుకొని కడతానన్న కేసీఆర్ 7 ఏళ్లుగా ఎక్కడున్నారని అరుణ నిలదీశారు. 7 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ఆమె అడిగారు.

జూరాల దగ్గర రోజు 5 టిఎంసిల నీరు తీసుకునే విధంగా ప్రాజెక్టు కట్టాలని ఆమె డిమాండ్  చేశారు. బీజేపీ.. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉందని డీకే అరుణ స్పష్టం చేశారు.  హుజురాబాద్ ఉప ఎన్నికల క్రమంలో కేసీఆర్ కు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.