క్యా బండీ..! హాలత్‌ కైసా హై?

క్యా బండీ..! హాలత్‌ కైసా హై?

‘క్యా బండీ..! హాలత్‌ కైసా హై..?’ అంటూ ప్రధాని  నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆత్మీయంగా పలకరించారు. ‘సబ్‌ ఠీక్‌ హో జాయేగా..’ అంటూ వెన్ను తట్టారు. ప్రధాని మోదీని గురువారం పార్లమెంటులోని ఆయన చాంబర్‌లో ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ మర్యాదపూర్వకంగా కలిసింది. 

ఈ సందర్భంగా ఓబీసీ కమిటీ చైర్మన్‌ సంజయ్‌ను పరిచయం చేయబోగా ‘బండి.. మాలూమ్‌ హైనా..!’ అని చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. సుమారు పావు గంట పాటు కొనసాగిన ఈ సమావేశం సందర్భంగా సంజయ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని.. తెలంగాణ రాజకీయాలపై ఆరా తీశారు. ‘అచ్ఛా కామ్‌ కర్‌  రహే.. కీపిట్‌ అప్‌.. గో ఎహెడ్‌..’ అని భుజం తట్టారు. 

ఈ భేటీలో భాగంగా బండి సంజయ్ జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఒబిసిలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్లూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

‘గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ఒబిసిలంతా మీకు రుణపడి ఉంటారు. దేశ ప్రజలు మిమ్ముల్ని ఎన్నటికీ మర్చిపోర’ని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు. 

కాగా, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని అనంతపురం గ్రామం నుంచి తిమ్మాపూర్‌ వరకు కొత్త సర్వీసు రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి  సంజయ్‌  లేఖ రాశారు. కరీంనగర్‌ జిల్లాలోని కోట్ల నర్సింహులపల్లె గ్రామంలో పురాతన శ్రీ లక్ష్మీనర్సింహ, అన్నపూర్ణ విశ్వనాథ ఆలయాలను సంరక్షించాలని కోరుతూ పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి సంజయ్‌ మరో లేఖ రాశారు.  

16 నుంచి కేంద్ర మంత్రుల ఆశీర్వాద యాత్ర

ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు ఆశీర్వాద యాత్రలు నిర్వహిస్తారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఢిల్లీలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ యాత్ర చేపడతారన్నారు. ఈ నెల 11న ఓబీసీకి చెందిన కేంద్ర మంత్రులను సన్మానిస్తామని చెప్పారు.