ప్రజలకు ఉత్తమ పాలన అందించండి

ప్రజలకు ఉత్తమ పాలన అందించాలని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బసవరాజు బొమ్మై తొలిసారిగా శుక్రవారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలుసుకున్నారు. 

తనపై నమ్మకం ఉంచి సీఎంగా బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్, హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రధానితో భేటీ సందర్భంగా సీఎం బసవరాజ బొమ్మై కర్ణాటక రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మోదీ స్పందిస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని, కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. 

ఇదే సమయంలో వరద నష్ట పరిహారం అందించాలని, హుబ్లీ–ధారవాడ ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్స్, రాయచూరుకు ఎయిమ్స్‌ తరహాలో వైద్య సంస్థను మంజూరు చేయాలని ప్రధానికి సీఎం విన్నవించారు. కలబురిగి ఈఎస్‌ఐ వైద్య కళాశాల, స్థానిక ఆస్పత్రిని ఎయిమ్స్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. 

సీఎం విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి.. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించి వారం రోజుల్లోగా మంత్రివర్గ విస్తరణ చేపడతానని తెలిపారు.

కాగా, మంత్రివర్గ ఏర్పాటు ముఖ్యమంత్రి ఇష్టమని, అందులో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, సలహాలు కూడా ఇవ్వనని తాజా ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు.  కేబినెట్‌ ఏర్పాటులో బొమ్మైకు పూర్తిగా స్వాతంత్య్రం ఉందన్నారు. అధిష్ఠానం, ముఖ్యమంత్రి కలిసి మంత్రి వర్గాన్ని ఖరారు చేస్తారని తెలిపారు. 

కాగా,  కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలకు గుడ్‌బై చెప్పి బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న వారికి తాను ఎటువంటి హామీ ఇవ్వలేదని చెప్పారు.  వారికి మంత్రి పదవి ఇవ్వడం లేదా కాదనుకోవడమనేది బొమ్మైకు చెందిన అంశమని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కట్టుబడ్డానని, ఇందుకోసం రాష్ట్రమంతటా పర్యటిస్తానని పేర్కొంటూ రాష్ట్రంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేస్తానని ప్రకటించారు.