
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర మంత్రివర్గం డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గారంటీ కార్పోరేషన్ (డిఐసిజిసి) చట్టం 1961లో సవరణలు చేసింది. దివాళా తీసిన బ్యాంకుల నుండి కూడా ఖాతాదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించింది.
బ్యాంకులు సమస్యల్లో చిక్కుకుని, నగదు అందుబాటులో లేని పరిస్థితి తలెత్తినపుడు డిపాజిటర్లకు బీమా సదుపాయం కల్పించేందుకు వీలుగా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించబోతోంది. బ్యాంకు డిపాజిటర్ల కష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. మారటోరియం ఆంక్షల క్రింద ఉన్న బ్యాంకులకు నగదు అందుబాటులోకి వచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆ బ్యాంకులను లిక్విడేట్ చేసే వరకు డిపాజిటర్లు వేచి చూడవలసిన అవసరం ఈ సవరణ వల్ల తప్పుతుంది.
బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలను ఆర్బీఐ నిలిపేసి, నిఘాలో ఉంచినపుడు కూడా ఆ బ్యాంకుల డిపాజిటర్లకు రూ.5 లక్షలు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ను కేబినెట్ ఆమోదించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.
డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది పూర్తిగా ఆర్బీఐ అనుబంధ సంస్థ. డిపాజిటర్లకు సొమ్మును బ్యాంకులు చెల్లించలేకపోతే, వారికి ఈ సంస్థ బీమాను అందజేస్తుంది. బ్యాంకు మారటోరియం క్రిందకు వచ్చిన 90 రోజుల్లోగా డిపాజిటర్లకు ఈ బీమా లభిస్తుంది. డిపాజిటర్లకు సకాలంలో అండగా నిలవడం కోసం ఈ సవరణ చేశారు.
భారత దేశంలో ఉన్న వాణిజ్య, విదేశీ బ్యాంకులు; సెంట్రల్, స్టేట్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు; రీజనల్ రూరల్ బ్యాంకులు; లోకల్ బ్యాంకుల డిపాజిటర్ల సొమ్ముకు ఈ సంస్థ రక్షణ కల్పిస్తుంది.తాజా సవరణలతో డిఐసిజిసి ద్వారా 98.3 శాతం ఖాతాదారులు లబ్ధి పొందుతారని ఆర్ధిక మంత్రి తెలిపారు.
అయితే ఆయా బ్యాంకులు ఈ సంస్థ పరిధిలోకి వచ్చే అవకాశాన్ని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సేవింగ్స్, కరెంట్, రికరింగ్, ఫిక్స్డ్ వంటి అన్ని రకాల డిపాజిట్ హోల్డర్లకు ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది. అన్ని రకాల బ్యాంకు డిపాజిట్ అకౌంట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బీమా చేస్తుంది. ఒక బ్యాంకులో ఒక ఖాతాదారుకు రూ.5 లక్షల వరకు ఇటువంటి డిపాజిట్లు ఉంటే, వాటిపై ఈ బీమా సదుపాయం లభిస్తుంది.
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్, యస్ బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇటీవల సమస్యల్లో చిక్కుకోవడంతో, డిపాజిటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడం కోసం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చట్టానికి సవరణ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
ఈ సవరణ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. గత ఏడాది పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లకు బీమాను రూ.5 లక్షలకు ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ బీమా రూ.1 లక్ష వరకు ఉండేది.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు