రూ.750 కోట్లతో లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కేంద్ర విశ్వవిద్యాలయాన్ని రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. 
లడఖ్  ప్రాంత అభివృద్ది కోసం లడఖ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎల్ఐడీసీఓ) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ తెలిపారు. లడఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009ను సవరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
“ఈ విశ్వ విద్యాలయాన్ని స్థాపించడం వల్ల ఉన్నత విద్యా రంగంలో ప్రాంతీయ అసమతుల్యతలను తొలగిస్తుంది. అలాగే, ఈ ప్రాంతంలో మేధో వృద్ధికి సహాయపడుతుంది, ఉన్నత విద్య వ్యాప్తికి సహాయపడుతుంది. ఈ ప్రాంతంలోని ఇతర విద్యా సంస్థలకు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఒక నమూనాగా నిలుస్తుంది” అని ఠాకూర్ తెలిపారు.
రాబోయే సెంట్రల్ యూనివర్సిటీ అధికార పరిధి లేహ్, కార్గిల్ తో సహా మొత్తం లడఖ్ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఎల్ఐడీసీఓ కార్పొరేషన్ “లడఖ్‌లో పరిశ్రమలు, పర్యాటకం, రవాణా సేవలు, స్థానిక ఉత్పత్తులు, హస్తకళల మార్కెటింగ్ అభివృద్ధిని చూసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు” మంత్రి తెలియజేశారు.
రూ 25 కోట్ల అధీకృత వాటా మూలధనంతో కంపెనీల చట్టం కింద కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. కార్పొరేషన్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడటంతో పాటు స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే ఉక్కు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద రూ.6,322 కోట్లను కేటాయించారు. ఎండ్ టూ ఎండ్ తయారీకి ఈ పథకం ప్రోత్సాహాన్ని అందిస్తుంది.