ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్ల ఉపశమనం

ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్ల ఉపశమనం
కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంనుంచి గట్టెక్కెందుకు ఊరట చర్యలను ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు పలు కీలక ఉపశమన చర్యలనుసోమవారం వెల్లడించారు. ఆర్థిక నష్టాలనుంచి గట్టెక్కేలా పలు పరిశ్రమలకు ఆర్థిక సహాయ చర్యలకు సంబంధించి కేంద్ర మంత్రి సోమవారం మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రకటించారు.  

 వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు  భారీగా  రూ 50 వేల కోట్ల నిధులను మంత్రిత్వ శాఖ కేటాయించింది.  వైద్య, ఆరోగ్య రంగానికి సేవలందించే సంస్థలకు చేయూతనిస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు.  ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు రూ.23,220 కోట్లు కేటాయించారు. చిన్నారుల సంర‌క్ష‌ణపై ఈ స్కీమ్‌లో ఎక్కువ‌గా కేంద్రీక‌రించిన‌ట్లు మంత్రి నిర్మ‌ల తెలిపారు. 

ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌నున్నారు. న‌ర్సులు, డాక్ట‌ర్లు, వైద్య ప‌రిక‌రాలు, అంబులెన్సులు, ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. కానీ చిన్నారుల భ‌ద్ర‌తే ముఖ్యంగా ఆ నిధుల్ని ఖ‌ర్చు చేస్తారు. కోవిడ్ కేంద్రీకృత హాస్పిట‌ళ్లు 25 శాతం పెరిగిన‌ట్లు ఆమె చెప్పారు. 42 శాతం ఐసోలేష‌న్ బెడ్స్‌, 45 శాతం ఐసీయూ బెడ్స్ పెరిగిన‌ట్లు మంత్రి తెలిపారు.

అలాగే అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం (ఇసిఎల్‌జిఎస్‌ పరిమితిని) రూ .4.5 లక్షల కోట్లకు పెంచింది. టైర్ 2 ,3నగరాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక శాఖ ప్రాధాన్యతనిచ్చింది. క్రెడిట్ గ్యారెంట్ స్కీమ్ అనేది కొత్త పథకమని, ఇందువల్ల 25 లక్షల మంది లబ్ధి పొందుతారని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

చిన్న చిన్న రుణాలు తీసుకునే వారికి మెక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు ఇస్తామని, గరిష్టంగా రూ.1.25 లక్షల వరకూ రుణం ఇస్తామని పేర్కొన్నారు. పాత రుణాల వసూళ్లపై కాకుండా కొత్త రుణాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు.  చిన్న పట్టణాలతో పాటు మారుమాలు ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని తీసుకు వెళ్తామని మంత్రి తెలిపారు. 

న్యూ క్రెడిట్ గ్యారెంట్ స్కీమ్ కింద వడ్డీ రేటు 2 శాతంగా ఉంటుందని, ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన వడ్డీ రేటు కంటే తక్కువని చెప్పారు. రుణాల చెల్లింపునకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. ఇత‌ర రంగాల‌కు సుమారు 60 వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని మంత్రి ప్ర‌క‌టించారు. ఆ రుణాల‌కు ప‌న్ను వ‌సూల్ శాతాన్ని 8.25 శాతంగా ఫిక్స్ చేశారు. ఫ‌ర్టిలైజ‌ర్ల స‌బ్సిడీ కోసం 14,775 కోట్లు కేటాయించారు.

ఈ ఏడాది ర‌బీ సీజ‌న్‌లో రికార్డు స్థాయిలో గోధుమ‌ల‌ను సేక‌రించిన‌ట్లు మంత్రి చెప్పారు. ర‌బీ మార్కెట్ సీజ‌న్ వేళ నేరుగా రైతుల అకౌంట్లోకి 85,413 కోట్లు బ‌దిలీ చేసిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  ట్రావెల్‌, టూరిజం రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించారు. 11వేల మంది టూరిస్టు గైడ్లు, ట్రావెల్‌, టూరిజం స్టేక్‌హోల్డ‌ర్ల‌కు రుణాలు క‌ల్పిస్తారు. వంద శాతం గ్యారెంటీతో ఆ రుణాలు ఇవ్వ‌నున్నారు.

అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల రాక మొద‌లైన త‌ర్వాత తొలి 5 ల‌క్ష‌ల మంది టూరిస్టుల‌కు ఉచితంగా వీసాలు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ చెప్పారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ రోజ్‌గార్ యోజ‌న‌ను ఈ ఏడాది జూన్ 30వ తేదీ నుంచి వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌ర‌కు పొడిగించారు. 

ఆర్ధిక మంత్రి ప్రకటించిన ఉపశమన చర్యలు 

►8 రిలీఫ్‌ ప్యాకేజీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
►కోవిడ్‌ వల్ల నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం
►రూ.1.1 లక్ష కోట్ల రుణహామీ పథకం‌
►ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు
►ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద ఆర్థికసాయం
►వైద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
►టైర్‌ 2,3 పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తాం
►ఇతర రంగాలకు  60వేల కోట్ల  లోన్‌ గ్యారంటీ
►అలాగే  వడ్డీ రేటు 8.25 శాతం
►డీఏపీ,  పి అండ్ కె ఎరువులకు ప్రభుత్వం అదనపు రాయితీలు
►అంతర్జాతీయ ప్రయాణం తిరిగి ప్రారంభమైన తర్వాత, భారతదేశానికి వచ్చే తొలి 5 లక్షల మంది పర్యాటకులకు వీసా ఫీజు రద్దు. ఈ పథకం మార్చి 31, 2022 వరకు  లేదా మొదటి 5 లక్షల వీసాలకు వర్తిస్తుంది. ఒక పర్యాటకుడు ఒక్కసారి మాత్రమే ఈ ప్రయోజనం పొందగలరు.
►ట్రావెల్ ఏజెన్సీలకు రూ .10 లక్షల రుణం
►ప్రజారోగ్యం కోసం రూ .23,220 కోట్ల అదనపు నిధులు, ప్రధానంగా పిల్లలు,  పిల్లల సంరక్షణపై దృష్టి
► బడుగు,బలహీన వర్గాల ఆహార భద్రత కోసం గత ఏడాది ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్నాయోజన పథకం 2021 నవంబర్ వరకు పొడిగింపు
► 5 కిలోల ఆహార ధాన్యం ఉచితంగా పంపిణీ.  తద్వారా మొత్తం  వ్యయం రూ .2.27 లక్షల కోట్లు
► అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కోసం రూ .19,041 కోట్ల అదనపు సహాయం.