లాక్‌డౌన్ నిర్ణయంలో కేసీఆర్ పై ఓవైసీ ప్రభావం! 

లాక్‌డౌన్ నిర్ణయంలో కేసీఆర్ పై ఓవైసీ ప్రభావం! 

కరోనా కట్టడికి తెలంగాణలో లాక్‌డౌన్ విధించడం, పొడిగించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ వత్తిడులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు స్పష్టం అవుతున్నది. మొదటి నుండి లాక్‌డౌన్ విధించడాన్ని ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

అందుకనే కరోనా రెండో వేవ్ ఉధృత రూపం దాలుస్తున్నా, దేశంలో పలు రాష్ట్రాలలో ఆంక్షలు విధిస్తున్న కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. అయితే రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేయడం, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొంటుందా, తమనే నిర్ణయించమంటారా అంటి హైకోర్టు అల్టిమేటం ఇవ్వడంతో కేసీఆర్ కు ఈ నెల 12 నుండి లాక్‌డౌన్ విధించక తప్పలేదు. 

రంజాన్ గడిచాక విధించుదామని కాలయాపన చేస్తూవచ్చినా, హైకోర్టు అల్టిమేటం ఇవ్వడంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. దీని కారణంగా తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో మరో పదిరోజుల పాటు పొడిగించారు. మే 30తో ఆ గడువు ముగుస్తుండగా, ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై మరో 10 రోజులు పొడిగించింది. 

అయితే మంత్రివర్గ సమావేశానికి కొన్ని గంటల ముందుగా, రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించ‌వ‌ద్ద‌ని అంటూ ఒక విధంగా కేసీఆర్ కు స్పష్టం చేశారు. జనసమ్మర్దాన్ని తగ్గించాలనుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధించాలి. లేదా కొవిడ్ క్లస్టర్లలో మినీ లాక్‌డౌన్ విధించాలని సూచిస్తూ ట్వీట్ చేశారు. మంత్రివర్గం లాక్‌డౌన్ కు సడలింపులు సమయాన్ని పొడిగించడంలో ఓవైసీ ప్రకటన ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నది. 

సాయంత్రం 6 గంటల నుండి కర్ఫ్యూ విధించుకోవచ్చని ఆయన సూచిస్తే, మంత్రివర్గం మధ్యాహ్నం 2 గంటల నుండి లాక్‌డౌన్ ప్రకటించడం గమనార్హం. సడలింపు సమయాన్ని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పొడిసిస్తున్నట్లు ప్రకటించినా 2 గంటల వరకు వెసులుబాటు ఇచ్చారు. అంటే సడలింపు 4 గంటలు పొడిగించి, ఓవైసీ సూచించినదానికన్నా మరో నాలుగు గంటలు మాత్రమే లాక్‌డౌన్ విధించారని చెప్పవచ్చు. 

గత ఏడాది లాక్‌డౌన్ విధించిన సమయంలో సహితం నాటి ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్, నగర పోలీసులు చాలా సమర్ధవంతంగా అమలు చేసి, అందరి ప్రశంసలు పొందడం తెలిసిందే. పాత బస్తీలో సహితం గట్టిగా అమలు జరిపారు. దానితో ఓవైసీ నుండి అభ్యంతరాలు చెలరేగాయి. ఆ సమయంలో కేసీఆర్ కుమారుడు కె టి రామారావు రంగంలోకి వచ్చారు. 

పాతబస్తీలో పేరుకు తప్ప లాక్‌డౌన్ అంటూ లేకుండా చేశారు. పోలీసులపై రౌడీ మూకలు దాడులు జరిపినా ఎవ్వరు పట్టించుకోలేదు. చివరకు పాతబస్తీలోని ఉపముఖ్యమంత్రి కుటుంభం సభ్యులపై దాడులు జరిగినా పట్టించుకున్న వారు లేరు.  కంటైన్మెంట్ జోన్ లలో సహితం ఎటువంటి ఆంక్షలు అమలుకాకుండా చేశారు. కరోనా ఉధృతిని కప్పిపుచ్చడం కోసం కరోనా టెస్ట్ లను తగ్గించివేశారు.