వ్యాక్సిన్‌ వృథాపై ప్రధాని మోదీ ఆందోళన 

కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో వ్యాక్సిన్‌ వృథాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన చేశారు. టీకా వృథాను ఆపడం అత్యంత ముఖ్యమని చెబుతూ ఒక్కో డోసు వృథా.. ఒక జీవితానికి రక్షణ కల్పించే అవకాశం వృథా అయినట్టేనని హెచ్చరించారు.  దేశంలో కోవిడ్ మేనేజిమెంట్‌పై క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో ప్రధాని మోదీ రెండో విడత గురువారంనాడు సమావేశమయ్యారు.
పది రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో పాటు మమతా బెనర్జీతో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు.  వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని, పట్టణ.. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులంతా పర్యవేక్షించాలని ప్రధాని కోరారు.  రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరాపై స్పందిస్తూ ఆరోగ్య మంత్రిత్వశాఖ 15 రోజుల పాటు టీకాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రాలకు అందిస్తుందని, వ్యాక్సినేషన్‌లో సహాయపడుతుందని హామీ ఇచ్చారు.

భేటీలో ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్‌, బెంగాల్‌ అధికారులు పాల్గొన్నారు.వందేళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా అని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా జిల్లా అధికారులు తమ విధులు నిర్వర్తించటం సవాల్​గా మారిందని పేర్కొన్నారు. యాక్టివ్ కేసులు కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని, అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఇన్‌ఫెక్షన్ అనేది ఏ కొద్దిగా మిగిలినా మన ముందున్న సవాలు పూర్తిగా తొలగనట్టేనని ప్రధాని మోదీ చెప్పారు.

అందుబాటులో ఉన్న వనరులతో మహమ్మారిపై పోరాడాలని ప్రధాని  సూచించారు. కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం చెంది వ్యాప్తి చెందుతోందని చెబుతూ  వైరస్‌పై విధానాలు, వ్యూహాలు నిత్యం మార్చుకోవాలని చెప్పారు. మ్యుటెంట్ల నేపథ్యంలో యువత, చిన్నారులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

కరోనా బారినపడిన యువత, చిన్నారుల వివరాలు సేకరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు తమ జీవనాన్ని సులభతరం చేసేందుకు ఉచిత రేషన్‌, ఇతర నిత్యావసర సామగ్రి అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరారు.

ప్రాణాలు కాపాడడడంతో పాటు ప్రతి వ్యక్తి జీవన సౌలభ్యం తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. పేదలకు ఉచిత రేషన్‌ సౌకర్యాలు ఉండాలని, నిత్యావసర సరుకులు నల్లబజారుకు తరలించకుండా చూడాలని చెప్పారు. ఇవన్నీ పోరాటంలో గెలిచేందుకు, ముందుకు సాగేందుకు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.