వ్యవసాయ చట్టాలకు 25 రైతు సంస్థల మద్దతు 

వ్యవసాయ చట్టాలకు 25 రైతు సంస్థల మద్దతు 
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకవైపు రైతు సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తుండగా, మరోవైపు వ్యవసాయ చట్టాలకు మద్దతుగా 25 రైతు సంఘాల నేతలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను సోమవారం సాయంత్రం కలుసుకున్నారు. 
 
నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఒక లేఖను అందజేశారు. రైతు సంఘాల ప్రతినిధులను ఈనెల 30వ తేదీన చర్చలకు రావాల్సిందిగా కేంద్రం తాజాగా ఆహ్వానించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 
 
తనను కలిసిన రైతు నేతలతో తోమర్ మాట్లాడుతూ, రైతుల మద్దతు, సానుకూల వైఖరి, చట్టాలపై అవగాహనతో చట్టాలను విజయవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు వాస్తవాలు వివరించడంలో సఫలమవుతామని పేర్కొన్నారు. దేశ వ్యవసాయరంగం సుసంపన్నమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్, శరద్ పవార్ సైతం వ్యవసాయ చట్టాలను తీసుకురావాలని అనుకున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే ఒత్తిళ్లకు నిలవలేకపోయరని చెప్పారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసే మోదీ ప్రధాని కావడం మన అదృష్టమని తోమర్ చెప్పారు.