కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మూడో టీఎంసీ వాడకానికి సంబంధించిన ప్రాజెక్టును ఓ భారీ కుంభకోణం అని బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ’వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అందించకుండా మూడో టీఎంసీ పనులకు అనుమతించడం కష్టమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు.
విస్తరణ పేరిట రూ. 20 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది అని ధ్వజమెత్తారు. డీపీఆర్ ఎందుకు ఇవ్వడం లేదో సీఎం మొదట చెప్పాలని డిమాండ్ చేశారు.రూ.
32 వేల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలుత రూపకల్పన చేసి- కేంద్రం అనుమతులిచ్చిన తర్వాత డీపీఆర్లు, అంచనాలు మార్చేసి- పెట్టుబడుల క్లియరెన్సులు లేకుండా అంచనా వ్యయాన్ని ఒకేసారి నిబంధనలకు విరుద్ధంగా రూ. 82 వేల కోట్లకు పెంచారు. ఎందుకు మార్చారని అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదు.
“మా రాష్ట్రం.. నా నీళ్లు మా ఇష్టం అంటారు. మీ రాష్ట్రం అంటే.. మీ అయ్య జాగీరా? మీ తాత జాగీరా? చెప్పాలి. ప్రజల ఆస్తి దోచుకుంటే అడ్డుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది.’’ అని సంజయ్ కేసీఆర్ ను నిలదీశారు.
అక్టోబరు 3న ఇంజనీర్ ఇన్ చీఫ్ కేంద్ర జలసంఘానికి లేఖ రాస్తూ మూడో టీఎంసీ పనుల ద్వారా ఒక్క చుక్కనీరు కూడా అదనంగా తీసుకోవడం లేదని, అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం లేదని వివరించారని గుర్తు చేశారు. ’ఒక్క ఎకరాకు అదనంగా నీళ్ల ఇవ్వకుంటే విస్తరణ ప్రాజెక్టు ఎందుకు..? రూ. 20 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఇది కేవలం కాంట్రాక్టర్ల జేబు లు నింపి కమిషన్ల కోసమే చేస్తున్నారు’ అని సంజయ్ ఆరోపించారు.
డీపీఆర్ అందించాలని అపెక్స్ కౌన్సిల్ భేటీ లోనూ కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎన్జీటీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి జలాలకు సంబంధించి లేఖ ఇస్తే ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం పేర్కొందని సంజయ్ గుర్తు చేశారు.
ఒక్క రోజులోనే లేఖ పంపిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రెండు నెల లు గడిచినా లేఖ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. మరోవంక పొర్లు దండాలు పెట్టినా సీఎం కేసీఆర్ను క్షమించే ప్రసక్తే లేదని సంజయ్ తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.
కేసీఆర్పై తప్పకుండా కేసులు పెడతామని, ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వచ్చారు? ఏం సాధించారు? ఈ పర్యటనపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, టీఆర్ఎస్ నేతల్లోనూ అయోమయం నెలకొందని సంజయ్ స్పష్టం చేశారు.
బీజేపీపై యుద్ధం చేస్తానన్న కేసీఆర్ ఢిల్లీలో ఏ చౌరస్తాలో కత్తి దింపారో చెప్పాలని ఎద్దేవా చేశారు. కేవలం అవినీతిని కప్పి పుచ్చుకోడానికే ఢిల్లీ వచ్చారని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి, గుంటనక్కలా దోచుకున్న సీఎం ఢిల్లీకి వచ్చి వంగి వంగి దండాలు పెడుతున్నారని దయ్యబట్టారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు